మధిర రూరల్, జూలై 27 : ఎల్నినో ప్రభావంతో వర్షాలు సమృద్ధిగా కురవడం లేదని, దీంతో తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేసుకోవాలని కలెక్టర్ దివాకర టీఎస్ రైతులకు సూచించారు. మధిరలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విత్తన మేళా కార్యక్రమాన్ని కలెక్టర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్నినో పరిస్థితులను రైతులు సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు.
వర్షాలు పూర్తిస్థాయిలో కురవకపోవడంతో తక్కువ నీటితో సాగయ్యే పెసర, మినుము, కంది, బొబ్బర్లు, నువ్వులు, జొన్నలు, వివిధ రకాల కూరగాయల పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వేసుకోవాల్సిన విత్తనాలను ప్రభుత్వం తరఫున రైతు వేదికల్లో అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ తెలిపారు. విత్తన మేళా ఈ నెల 29 వరకు కొనసాగుతుందని, మండల రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బండారు నరసింహారావు, ఏడీఏ వాణిశ్రీ, ఏఆర్ఎస్ శాస్త్రవేత్త నాగస్వాతి, ఏవో సాయిదీక్షిత్, ఏఈవోలు, ప్రజాప్రతినిధులు, విత్తన డీలర్లు, రైతులు పాల్గొన్నారు.