కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. కరీంనగర్ నుంచి 28 మంది, పెద్దపల్లి నుంచి 42 మంది పోటీలో నిలువనున్నారు. కాగా, సోమవారం ఉపసంహరణల ప్రక్రియ ముగియగా, కరీంనగర్లో ఐదుగురు, పెద్దపల్లిలో ఏడుగురు విత్ డ్రా చేసుకున్నారు. దాంతో పోటీలో ఉన్న అభ్యర్థుల లిస్ట్ను అధికారులు ప్రకటించారు.
పెద్దపల్లి, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ)/కరీంనగర్ కలెక్టరేట్ : కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ స్థానాల్లో పోటీలో నిలిచిన అభ్యర్థుల లెక్క తేలింది. ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్లకు అవకాశం ఉండగా, పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దాఖలు చేశారు. అయితే సోమవారం పలువురు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో పోటీలో ఎంతమంది నిలిచారో యంత్రాంగం ప్రకటించింది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బరిలో 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 33 మంది నామినేషన్ వేయగా, ఐదుగురు విత్డ్రా చేసుకున్నారు.
బరిలో నిలిచిన వారిలో 13 మంది వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు కాగా, 15 మంది స్వతంత్రులు ఉన్నారు. ఉపసంహరించుకున్న వారిలో మహ్మద్ జిషాన్, గుజ్జుల శ్రీనివాస్రెడ్డి, ఆరెల్లి సుమలత, పిడిశెట్టి రాజు, పచ్చిమట్ల రవీందర్ ఉన్నారు. వీరంతా రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతికి తమ ఉపసంహరణ పత్రాలు అందజేశారు. ఇక పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ బరిలో 42 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
మొత్తం 49 మంది నామినేషన్ వేయగా, ఏడుగురు విత్డ్రా చేసుకున్నారు. వారిలో అభ్యర్థులైన గవ్వల శ్రీకాంత్, జాడి బాల్ రెడ్డి, మోటం రవీందర్, జుమ్మిడి గోపాల్, జాడి ప్రేమ్ సాగర్, దుర్గం సమ్మయ్య, దాగం సుధారాణి అభ్యర్థులు ఉన్నారు. వీరంతా రిటర్నింగ్ అధికారి ముజామ్మిల్ ఖాన్ను తమ ఉపసంహరణ పత్రాలు అందజేశారు. కాగా, రాజకీయ పార్టీల నుంచి బరిలో నిలిచిన వారికి ఆయా పార్టీల గుర్తులు కేటాయించనుండగా, స్వతంత్రులకు ఎన్నికల సంఘం విడుదల చేసిన గుర్తులను రిటర్నింగ్ అధికారులు కేటాయించారు.