కంఠేశ్వర్, ఏప్రిల్ 29: లోక్సభ ఎన్నికల్లో ప్రధాన ఘట్టం ముగిసింది. సోమవారంతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియగా, బరిలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలింది. నిజామాబాద్ నియోజకవర్గంలో 29 మంది, జహీరాబాద్ స్థానంలో 19 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. సోమవారం చివరి రోజు ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు ముత్యం రఘు, పోతు నాగార్జున్, పోతు రవి నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. ఇక, జహీరాబాద్ స్థానంలో ఏడుగురు తమ దరఖాస్తులను ఉపసంహరించుకున్నారు. చివరకు 19 మంది బరిలో మిగిలారు.
నిజామాబాద్ లోక్సభ బరిలో నిలిచిన 29 మంది అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిన అనంతరం బరిలో ఉన్న అభ్యర్థులతో రిటర్నింగ్ అధికారి రాజీవ్గాంధీ హన్మంతు కలెక్టరేట్లో భేటీ అయ్యారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎలిస్ వజ్ ఆర్ సమక్షంలో ఈసీ మార్గదర్శకాల ప్రకారం అభ్యర్థుల పేర్లను బట్టి అధికార తెలుగు భాషా వర్ణమాల ప్రకారం క్రమ సంఖ్య, గుర్తులను కేటాయించారు.