హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావును లక్ష్యంగా చేసుకొని ఇటీవల చేసిన ‘క్షుద్ర పూజల’ ఆరోపణలు ముఖ్యమంత్రి స్థాయికి ఏమాత్రం తగవన్న భావన రాష్ట్ర మంత్రివర్గంలో వ్యక్తమైంది. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన క్యాబినెట్ భేటీలో ఈ వ్యవహారంపై గంభీరమైన చర్చ జరిగినట్టు తెలిసింది. సీఎం స్థాయి వ్యక్తులు ఇలాంటి ఆరోపణలు చేయడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ పెరుగకపోగా, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని మంత్రులు చెప్పారని సమాచారం.
ప్రజలెవరూ ఈ వ్యాఖ్యలను సానుకూలంగా స్వీకరించడం లేదని, ఇలాంటి అపరిపక్వ ప్రకటనలను ఇంతటితో వదిలేయడమే అన్ని విధాలా శ్రేయసరమని మంత్రివర్గం ముక్తకంఠంతో అభిప్రాయపడినట్టు తెలిసింది. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులపై తాము భావించిన స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత లేదని క్యాబినెట్ సమీక్షలో తేలినట్టు సమాచారం. నీటిపారుదల రంగంపై హరీశ్రావుకు ఇప్పటికీ ప్రజల్లో మంచి పేరే ఉన్నదని, ఆయనపై గుడ్డిగా వ్యక్తిగత దాడులు చేయడం వల్ల రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం ఉన్నదని మంత్రులు ఆందోళన వ్యక్తంచేసినట్టు తెలిసింది. రాజకీయ ఆరోపణలు మాని, నిర్మాణాత్మక అంశాలపై దృష్టి పెట్టకపోతే మరింత పలుచనవుతామనే భావన మంత్రుల నుంచి వ్యక్తమైంది.
మరోవైపు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, పారిశ్రామిక పెట్టుబడుల ప్రవాహం గణనీయంగా పడిపోతుండటంపై క్యాబినెట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నిరుడు ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ఆశించిన లక్ష్యాలను ఏమాత్రం అందుకోలేకపోయిందని మంత్రివర్గం ఏకాభిప్రాయంతో అంగీకరించినట్టు తెలిసింది. కొత్త పెట్టుబడులు రాకపోవడం వల్ల రాష్ట్ర గ్రోత్ రేట్ దారుణంగా పడిపోతున్నదని మంత్రులు ఆవేదన వ్యక్తంచేశారు. రాబోయే సమ్మిట్లో కూడా ఇదే పరిస్థితి పునరావృతమైతే ప్రతిపక్షాల నుంచి వచ్చే దాడిని తట్టుకోవడం ప్రభుత్వానికి అసాధ్యమని పలువురు మంత్రులు పేర్కొన్నట్టు సమాచారం.
ఈసారి ప్రచారానికే పరిమితం కాకుండా, దిగ్గజ కంపెనీల యాజమాన్యాలను నేరుగా రప్పించేలా పకా వ్యూహాలు రచించి, భారీ పెట్టుబడులు రాబట్టాలని తీర్మానించారు. ఇక రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్న ‘22-ఏ’ (నిషేధిత జాబితా) భూముల వ్యవహారంపై వాడీవేడిగా చర్చ సాగింది. హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఎకరాల భూములను రెవెన్యూ శాఖ 22-ఏ జాబితాలో చేర్చడంపై ప్రజలు, రైతుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని ప్రస్తావించారు. ‘నిషేధిత జాబితాలోని భూములను తక్షణమే తొలగించకపోతే ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం మునగడం ఖాయం’ అని మంత్రులు ఆందోళన వ్యక్తంచేసినట్టు సమాచారం.