హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక దళితబంధు పథకాన్ని ఈ ఏడాది మరింత విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరంలో అసెంబ్లీ నియోజకవర్గానికి వందమంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసిన ప్రభుత్వం.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్కో నియోజకవర్గంలో 1,500 మందికి పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయం తీసుకొన్నది. తొలిదశలో 500 మంది అర్హులైన లబ్ధిదారులను తక్షణం ఎంపికచేసి దళితబంధు పథకాన్ని అమలుచేస్తారు.
శనివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన ప్రగతిభవన్లో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నది. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తంగా అమలుచేస్తున్న నేపథ్యంలో, మిగిలిన 118 నియోజక వర్గాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1,77,000 మందికి దళితబంధు వర్తించనున్నది. తొలి దశలో 500 మంది చొప్పున తక్షణం 59 వేల మందికి దళితబంధు అందిస్తారు. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను త్వరగా ముగించాలని అధికారులను క్యాబినెట్ ఆదేశించింది.