హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): పోలవరం బ్యాక్వాటర్ సమస్యపై మరోసారి ఉమ్మడి సర్వే నిర్వహిస్తామని సీడబ్ల్యూసీ తెలిపింది. అందుకు సంబంధించిన వివరాలను ఈ నెల 9లోగా ఇవ్వాలని తెలంగాణకు సూచించింది. ఈ సర్వేకు పూర్తిగా సహకరిస్తామని, అన్ని రక్షణ చర్యలు చేపడతామని ఏపీ అధికారులు తెలిపారు. పోలవరం బ్యాక్వాటర్ సమస్యపై శుక్రవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి పంకజ్కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల ఇరిగేషన్ అధికారులు, సాంకేతిక నిపుణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో తెలంగాణ అధికారులు మాట్లాడుతూ.. వాస్తవిక వరదలకు, సీడబ్ల్యూసీ రూపొందించిన అంచనాలకు మధ్య వ్యత్యాసం ఉన్నదని వివరించారు. బ్యాక్వాటర్ ప్రభావంపై మరోసారి అధ్యయనం చేయాలని కోరారు. 2022లో వచ్చిన వరదల వల్ల 103 గ్రామాలు, 11,000 కుటుంబాలు, 28,000 మం ది వ్యక్తులు ముంపు బారినపడినట్టు తెలిపారు. పోలవరం డ్యామ్లో ఎఫ్ఆర్ఎల్ స్థాయిలో నీరు నిల్వ చేసినప్పుడు, నిర్వహించినప్పుడు నిలబడి ఉన్న నీటి వల్ల కూడా తీవ్ర ప్రభావం ఉంటుందని వాదించారు.
డ్రైనేజీ రద్దీ, మునిగిపోవడం వల్ల దాదాపు 150 గ్రామాల్లోని 50 వేల ఎకరాలు ప్రభావితమవుతాయని తెలిపారు. ఈ వాదనలతో ఏకీభవించిన సీడబ్ల్యూసీ ఉమ్మడి సర్వేకు అంగీకరించింది. సమావేశంలో తొలుత ఛత్తీస్గఢ్ అధికారులు మాట్లాడుతూ.. వివిధ అధ్యయనాలు పోలవరం వద్ద గరిష్ఠంగా 58 లక్షల క్యూసెకుల వరద ప్రవాహం ఉంటుందని చెప్తున్నాయని, ఆ మేరకు డిజైన్, బ్యాక్వాటర్ ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేయాలని డిమాండ్ చేశారు. ఒడిశా కూడా ఇదే డిమాండ్ వినిపించింది. దీనిపై ఉమ్మడిగా సమగ్ర అధ్యయనం, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని, అంతవరకు పోలవరం ప్రాజెక్టుకు అంగీకరించేది లేదని ఒడిశా స్పష్టం చేసింది. కేంద్రజల్శక్తిశాఖ, ఏపీ సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఏపీకి మాత్రమే అనుకూలంగా ఉన్నదని వాదించింది. అయితే ఒడిశా, ఛత్తీస్గఢ్ అభ్యంతరాలను కేంద్ర జలశక్తిశాఖ తిరస్కరించింది. కేవలం 36 లక్షల క్యూసెక్కుల వరద సామర్థ్యం మేరకే పరిగణనలోనికి తీసుకుంటామని తెలిపింది. సమావేశంలో సీడబ్ల్యూసీ చైర్మన్ ఆర్కే గుప్తా, పీపీఏ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్, తెలంగాణ నుంచి ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, కొత్తగూడెం సీఈ శ్రీనివాస్రెడ్డి, ఈఈ సుబ్రమణ్యం ప్రసాద్, రాకేశ్రౌతు, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్బాబుతోపాటు ఛత్తీస్గఢ్, ఒడిశా అధికారులు పాల్గొన్నారు.