Cubbon Park | బెంగళూరులోని కబ్బన్ పార్కు వారాంతాల్లో కిటకిటలాడుతూ ఉంటుంది. ఒకట్రెండు పుస్తకాలు, చాప, నీళ్లసీసా పట్టుకుని జనం వాలిపోతారు. తగిన చోటు ఎంచుకుని నచ్చిన పుస్తకం తెరుస్తారు. వర్షకాలం అయితే గొడుగు లేదా రెయిన్ కోట్ ఉంటుంది. ఇద్దరితో ప్రారంభమైన ఈ ఉద్యానవన పుస్తకప్రియుల సమూహం ఇప్పుడు దేశ, విదేశాల్లో 60 నగరాలకు విస్తరించడం విశేషం.
బెంగళూరులోని ‘కబ్బన్ పార్క్ రీడర్స్ క్లబ్’ మామూలు సంఘాలకు భిన్నమైంది. సాధారణ పుస్తకాల క్లబ్బుల సభ్యులు తాము చదివిన రచనల గురించి తప్పక చర్చించాల్సి ఉంటుంది. కానీ, పార్క్ సభ్యులకు ఇలాంటి నియమాలేవీ ఉండవు. తమకు ఇష్టమైతేనే చర్చల్లో పాల్గొనవచ్చు. కబ్బన్ రీడర్స్ క్లబ్ ప్రారంభం వెనక బెంగళూరుకు చెందిన శ్రుతి షా, ఆమె స్నేహితుడు హర్ష్ స్నేహాంశ్ చొరవ ఉంది. ఆ ఇద్దరూ 2022 డిసెంబర్లో కబ్బన్ పార్కులో తమకు నచ్చిన పుస్తకం చదువుతూ కొన్ని గంటలు గడిపారు. ప్రత్యేకించి, పచ్చటి గొడుగును తలపించే పెద్ద రావిచెట్టు నీడన చదువుకోవడం ఆహ్లాదకరంగా అనిపించింది. ఆ అనుభూతిని వాళ్లు సోషల్ మీడియాలో పంచుకున్నారు. అది చదివి తామూ వస్తామంటూ చాలామంది పుస్తకాలతో వాలిపోయారు. అంతే, ‘కబ్బన్ రీడ్స్’ పుస్తక ప్రేమికుల క్లబ్ మొదలైపోయింది.
ఈ ఏడాది జనవరి 14న ఐదారుగురితో మొదటి సమావేశం జరిగింది. ఆరు నెలల్లోనే ఈ సంఖ్య 700కు పెరిగిందంటేనే కబ్బన్ రీడ్స్కు బెంగళూరులో ఎంత ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ స్ఫూర్తిని దేశంలోని మిగిలిన నగరాలు కూడా అందిపుచ్చుకున్నాయి. ముంబయిలో జుహురీడ్స్, ఢిల్లీలో లోఢి రీడ్స్ పేరుతో రీడింగ్ క్లబ్స్ మొదలయ్యాయి. ఇప్పుడు కబ్బన్ రీడ్స్తో 60కి పైగా ‘రీడ్స్’ అనుసంధానమై ఉన్నాయి. ముంబయి, ఢిల్లీ, పుణె, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, గోవా, విజయవాడ, పుదుచ్చేరి తదితర నగరాలు ఈ రీడ్స్ సమూహంలో చేరిపోయాయి. న్యూయార్క్, జొహాన్నెస్బర్గ్, కౌలాలంపూర్ తదితర నగరాల్లోనూ అంతర్జాతీయ సమూహాలు ఉండటం విశేషం. ఇదంతా చూసి ముచ్చటపడి.. కొంతమంది దాతలు బెంచీలు సమకూర్చడానికి ముందుకొస్తున్నారు. పచురణ కర్తలు స్టాల్స్ ఏర్పాటు చేసి భారీ డిస్కౌంట్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. క్విజ్లు నిర్వహిస్తామంటూ వచ్చేవారు ఉన్నారు. ‘దీనివల్ల పార్కులోని ప్రశాంత వాతావరణం దెబ్బతింటుంది. క్లబ్కు వ్యాపారకోణాన్ని జోడించడం మాకు ఇష్టం లేదు. ఆ ప్రతిపాదనల్ని సున్నితంగా తిరస్కరించాం’ అని చెబుతారు నిర్వాహకులు.
పుస్తక పఠనం ఆరోగ్యకరమైన అంటువ్యాధి. ఈ మధ్య జైన్ యూనివర్సిటీ విద్యార్థుల బృందం కబ్బన్ పార్క్ రీడర్స్ క్లబ్ను సందర్శించింది. తమ క్యాంపస్లోనూ ఓ శాఖ ఏర్పాటు చేసుకుంటామని ప్రకటించింది. రీడ్ క్లబ్స్లో అన్ని వయసుల వాళ్లూ ఉన్నారు. పుస్తక ప్రియులలో ఉపశాఖలూ ఉన్నాయి. ఆంగ్ల సాహిత్యాన్ని ఇష్టపడేవారు ఒక గ్రూప్, ప్రాచీన కన్నడ అభిమానులు ఒక గ్రూప్, ఆధునిక కన్నడ సాహిత్య ప్రేమికులు మరో గ్రూప్. ఎవరికివారు శని, ఆదివారాల్లో మొబైల్ ఫోన్ల బెడద లేకుండా చెట్లనీడన ఏదో ఒక పుస్తకం చదువుతూ విజ్ఞానయాత్ర చేస్తారు. కొందరు మధ్యాహ్నానికే వెళ్లిపోతారు. కొందరు మాత్రం అక్కడే పుస్తక మిత్రులతో కలిసి భోజనం పూర్తి చేస్తారు. ప్రస్తుతం కబ్బన్ రీడింగ్ క్లబ్ నిర్వహణ బాధ్యతలు షా, స్నేహాంశు చూసుకుంటున్నారు. పుస్తకం చదువుతున్నాం అంటే మనం వేరేలోకంలోకి వెళ్లిపోతున్నట్టు. పార్కుల్లోకి వచ్చే పుస్తకప్రియులు కూడా బయటి ప్రపంచంతో వేరుపడతారు. అదే సమయంలో సహపాఠకులను తమ కుటుంబ సభ్యులుగా భావించుకుంటారు. ప్రకృతికి దగ్గరగా.. కాలుష్యానికి దూరంగా పుస్తక పఠనంలో మునిగిపోవడాన్ని మించిన అదృష్టం ఎక్కడుంది? ఆ అనుభూతి కావాలంటే మనమూ పార్కుల బాట పట్టాల్సిందే. అక్షర కాలక్షేపానికి పార్కులకంటే ప్రజాస్వామ్య స్థలాలు ఇంకేవీ లేవు. పచ్చదనం మధ్యలో చదువుతున్నప్పుడు కంటికి శ్రమ అని పించదు. మధ్యలో కాసేపు ఏ చెట్టునో, మొక్కనో చూసినా చాలు. ఇదోరకమైన గ్రీన్ థెరపీ. ఆ గంభీర వాతావరణాన్ని చూసి పోకిరీలు పారిపోతారు. అలా పార్కులను కాపాడినవాళ్లమూ అవుతాం.
ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో కబ్బన్పార్క్ పుస్తక ప్రేమికుల సంఘం హల్చల్ చేస్తున్నది. ఇన్స్టాలో అయితే ఇరవైవేల పైచిలుకు మంది ఫాలో అవుతున్నారు. లెక్కలేనన్ని వాట్సాప్ గ్రూపులు ఉండనే ఉన్నాయి. పుస్తకాలు షేర్ చేసుకుంటున్నారు. భావాలు పంచుకుంటున్నారు. వాదించుకుంటున్నారు. ఇదంతా ఆరోగ్యకరమైన పద్ధతిలోనే. ‘పుస్తకం చదివినప్పటి కంటే.. ఆ పుస్తకం గురించి చర్చిస్తున్నప్పుడే చాలా కొత్త విషయాలు తెలుస్తాయి’ అంటాడు శ్రీనివాస నాయక్ అనే సభ్యుడు. పుస్తక ప్రియులతోపాటు, దినపత్రికలు చదువుకోడానికి వచ్చేవాళ్లూ ఉన్నారు. ఒకరిద్దరు రచయితలు.. అక్కడే కలానికి, కాగితానికి పని చెబుతున్నారు. ఏదైనా అక్షరానుబంధమే కదా!
“feather library | పిట్టల ఈకలకు ఓ లైబ్రరీ.. ఎక్కడుందో తెలుసా”