ఎక్కడి నుంచో ఎగిరొచ్చి ఇంటి ఆవరణలో వాలిన ఓ పిట్ట ఈక, తనలో ఓ కొత్త అభిరుచికి ప్రాణం పోసిందని అంటారు ఈషా మున్షీ. అహ్మదాబాద్కు చెందిన 35 ఏళ్ల మున్షీ, మరో పక్షి ప్రేమికురాలు షెర్విన్ ఎవెరెట్ (30)తో కలిసి ‘ఫెదర్ లైబ్రరీ’ పేరిట డిజిటల్ పక్షి ఈకల నమూనా సేకరణ కేంద్రాన్ని స్థాపించారు. పది నమూనాలతో మొదలైన కార్యక్రమం.. నూటపదికి చేరింది. ఇందులో పక్షి పేరు, గుర్తింపు సంఖ్య.. తదితర వివరాలు నమోదు చేస్తున్నారు. ఆ గణాంకాల ఆధారంగా ప్రమాదంలో ఉన్న పక్షుల వివరాలు సేకరిస్తారు. వాటి కోసం సంరక్షణ కేంద్రాలు ప్రారంభించాలన్నది ఆ ఇద్దరి ఆలోచన.
ఈకల గురించి బాగా తెలుసుకునేందుకు ఎక్స్-రే, సీటీ స్కాన్ తదితర పరికరాలను ఉపయోగించుకోవాలనేది ప్రణాళిక. కార్యక్రమాల విస్తరణ కోసం, ఇప్పటికే కర్ణాటక అటవీశాఖతో సంప్రదింపులు జరుపు తున్నారు. ‘ఫెదర్ లైబ్రరీ’ నేతృత్వంలో ఫిబ్రవరి 20 వరకూ ‘క్యాంపస్ బర్డ్ కౌంట్’ పేరుతో జరుగుతున్న పక్షుల జనాభా సేకరణ కార్యక్రమంలో వివిధ విద్యాసంస్థలు, పరిశోధనశాలలు, కార్పొరేట్ కంపెనీలు పాల్గొంటున్నాయి.