Library | ప్రతి పుస్తకం అమూల్యమే. ప్రతి కాగితం విలువైనదే. ప్రతి అరలో అపార విజ్ఞానం. వేలకొద్ది పుస్తకాలు, వందలాది పరిశోధన పత్రాలు. అంతర్జాతీయ సదస్సులలో వెలువరించినవి కొన్ని.. పాత పుస్తకాల మార్కెట్లోనూ దొరకని ప్రాచీన గ్రంథాలు మరికొన్ని. గజ్జల రామేశ్వరం అనే జిజ్ఞాసి జీవితకాల కృషి ఫలితమే.. ఈ ‘ప్రకృతి’ విజ్ఞాన సంపద.
తైల మర్దనం మృత్తికా స్నానం. ఉపవాసం. ప్రకృతి వైద్యానికి సంబంధించి అక్కడలేని పుస్తకం లేదు. ఆ అరల్లో కనిపించని పరిశోధన పత్రం ఉండదు. ప్రకృతి వైద్యం మనదైన సంపద. అందుబాటులో ఉన్న దినుసులతో ఆరోగ్య సమస్యలకు ముగింపు పలికే సంప్రదాయ విధానం. మారుతున్న కాలంతోపాటు ఈ వైద్యమూ మూలనపడింది. ప్రతిదానికీ కార్పొరేట్ హాస్పిటళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మన ఆరోగ్యాన్ని మనమే బాగు చేసుకునే ప్రకృతి వైద్యాన్ని భవిష్యత్తు తరాలకు అందించే లక్ష్యంతో ప్రొఫెసర్ గజ్జల రామేశ్వరం ఓ గొప్ప ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ప్రకృతి వైద్యంపై అంతర్జాతీయ స్థాయి సాహిత్యాన్ని సేకరించారు. ఓ లైబ్రరీకి రూపకల్పన చేశారు. హనుమకొండలో ఏకంగా తన ఇంటినే గ్రంథాలయంగా మార్చారు. వందకాదు, రెండొందలు కాదు.. దాదాపు నాలుగువేల పుస్తకాలతో తీర్చిదిద్దారు. ఇది ఆయన జీవిత లక్ష్యం. ఈ అక్షర యజ్ఞం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ఓ జిజ్ఞాసి అవిశ్రాంత శ్రమ కూడా ఉంది.
మహబూబాబాద్ జిల్లా కురవి గజ్జల రామేశ్వరం స్వగ్రామం. పబ్లిక్ అడ్మినిస్ర్టేషన్లో పీజీ పూర్తి చేశారాయన. కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా విధులు నిర్వర్తించారు. గ్రామీణ ప్రాంతాలలో వైద్య, ఆరోగ్య పాలనపై పీహెచ్డీ చేశారు. ఆ సమయంలోనే ప్రకృతి వైద్య విధానం అంతరించిపోతున్న విషయాన్ని గ్రహించారు. ఓ వెలుగు వెలిగిన సంప్రదాయ విధానానికి ఆ దుస్థితి దాపురించడం రామేశ్వరం మనసుకు కలత కలిగించింది. క్రమంగా ప్రకృతి వైద్య విధానంపై ఆసక్తి పెంచుకున్నారు. దానికి సంబంధించిన పుస్తకాలను సేకరించడం ప్రారంభించారు. 1939 నుంచి ప్రకృతి వైద్యంపై వెలువడిన దాదాపు అన్ని పుస్తకాలనూ రామేశ్వరం సేకరించారు. అందుకోసం జీతంలో కొంతడబ్బు పక్కనపెట్టారు. ఇప్పుడు కూడా పింఛనులో కొంత శాతాన్ని ప్రకృతి వైద్య సాహిత్యానికి కేటాయిస్తున్నారు. హనుమకొండలో తన ఇంట్లోనే ప్రత్యేకంగా గదులను నిర్మించి 2018లో నేచురోపతి లైబ్రరీ ప్రారంభించారు. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, ఉర్దూ, అరబ్బీ, ఫ్రెంచ్, జర్మన్, ఇంగ్లిష్ మొదలైన భాషల పుస్తకాలు రామేశ్వరం లైబ్రరీలో ఉన్నాయి. లైబ్రరీని చూసేందుకు వచ్చేవారి కోసం ఇంటిపైన రెండు గదులు ఏర్పాటుచేశారు. ఈ లైబ్రరీలో సమాచారం కోసం విదేశీ పరిశోధకులూ వస్తుంటారు.
రామేశ్వరం తండ్రి కురవి పాఠశాలలో అటెండర్. ఆ ఊళ్లో మొదటి ప్రభుత్వ ఉద్యోగి ఈయనే. రామేశ్వరం భార్య టీచర్. కుటుంబసభ్యుల ప్రోత్సాహంతోనే ఆయన ప్రకృతి వైద్య లైబ్రరీ ఏర్పాటు చేశారు. ప్రకృతి వైద్యంపై ఐదు పుస్తకాలు రాశారు. ప్రకృతి వైద్యంపై తొలి నిఘంటువు రూపొందించారు. ‘ఆరోగ్య సాధనం’ అనే పత్రికనూ నడుపుతున్నారు. పుస్తకాల సేకరణ, రచనతోపాటు అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో ప్రకృతి వైద్యంపై పరిశోధన పత్రాలను సమర్పించారు. దేశీయ వైద్య విధానాలపై అనేక సెమినార్లలో పాల్గొన్నారు.
ప్రకృతి వైద్యంపై 32 ఏండ్లుగా ఉద్యమం చేస్తున్నా. దీంతో నాకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ప్రకృతి వైద్య లైబ్రరీ ఏర్పాటులో కుటుంబసభ్యుల ప్రోత్సాహం ఎంతో ఉంది. ప్రకృతి వైద్యంపై తెలుగులో రూపొందించిన తొలి పుస్తకం నా దగ్గర ఉంది. నిజాం పాలనలోనూ ప్రకృతి వైద్యానికి గుర్తింపు ఉంది. ఆసియా దేశాల్లో తొలిసారిగా నేచర్ క్యూర్ కోర్సును మన ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే ప్రారంభించారు.
– గజ్జల రామేశ్వరం
…✍ పిన్నింటి గోపాల్, ఫొటోలు : గొట్టె వెంకన్న
“నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వందేండ్ల క్రితం ఏర్పాటైన ఈ లైబ్రరీ గురించి తెలుసా”
అమెరికాలో జాబ్ వదిలేసొచ్చి.. సొంతూళ్లో లైబ్రరీ స్టార్ట్ చేసిండు”
“Jobs | నిరుద్యోగులకు ఓ ఉపాధ్యాయుడి కానుక.. లైబ్రరీ, వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి మరీ..”