చదువుకుంటే బతుకులు బాగుపడుతాయని, తను పడ్డ కష్టం ఎవరూ పడొద్దనీ భావించి ఇంట్లోనే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు ఓ ఉపాధ్యాయుడు. అలా, విలువైన పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. సెలువు రోజుల్లో స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులనూ నిర్వహిస్తున్నారు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్నగర్ మోడల్ స్కూల్ ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు కాసుల రవికుమార్.
వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటకు చెందిన రవికుమార్ 2007లో లీడ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. 14 ఏండ్లుగా పేద విద్యార్థులకు, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు చెబుతున్నారు. ఇటీవల తను నిర్మించుకొన్న రెండు పోర్షన్ల ఇంటికి ‘సాహితీ నిలయం’ అని నామకరణం చేశారు. ఒక పోర్షన్లో రవి కుటుంబం నివాసం ఉంటున్నది. మరో పోర్షన్లో ‘లీడ్ చిల్డ్రన్స్ లైబ్రరీ’ పేరుతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. సొంత డబ్బుతోపాటు దాతల సహకారంతో ఎన్నో పుస్తకాలు సేకరించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారి కోసం స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచారు. అంతేకాదు, ఒక సెకండ్ హ్యాండ్ కారు కొని.. దాన్ని సంచార గ్రంథాలయంగా మార్చారు. రోజూ నర్సంపేట నుంచి పాఠశాలకు వెళ్లే మార్గంలో ఏదో ఒక గ్రామంలో ఉదయం, సాయంత్రం గంట చొప్పున ఆగుతారు. అక్కడి విద్యార్థులకు పుస్తకాలను పంచుతారు. కార్లో సిద్ధంగా ఉండే బ్లాక్బోర్డ్ను ఏ చెట్టు కిందో పెట్టి.. స్పోకెన్ ఇంగ్లిష్ నేర్పిస్తారు. ఇలా ఊరూరా తిరుగుతూ విద్యార్థులను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతున్నారు రవికుమార్. ఇప్పటివరకు దాదాపు 70 గ్రామాలను సందర్శించారు. సుమారు వెయ్యి పుస్తకాలను విద్యార్థులకు ఉచితంగా అందించారు. అంతేకాదు, తనకు వచ్చే జీతంలో 33 శాతం గ్రంథాలయ నిర్వహణకు, సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు. కాబట్టే, ప్రభుత్వం రవికుమార్ను జిల్లా ఉత్తమ యువ పురస్కారంతో సత్కరించింది. ‘నేను స్పోకెన్ ఇంగ్లిష్ క్లాస్లు తీసుకోవడం వెనుక నా భార్య శోభారాణి సహకారం ఎంతో ఉంది. పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్ తప్పనిసరి. ఆ కారణంగా ఎవరూ అవకాశాలు కోల్పోకూడదు. రానున్న రోజుల్లో 20 గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా’ అని చెబుతారు రవికుమార్.
… బోయినపల్లి రంజిత్రావు