న్యూఢిల్లీ, మే 7: పర్యావరణ పరిరక్షణ కోసం ‘ముడతలు మంచివే’ అంటున్నది శాస్త్ర, సాంకేతిక పరిశోధన మండలి(సీఎస్ఐఆర్). ఇందుకోసం ప్రతి సోమవారం ఆ సంస్థ సిబ్బంది ఇస్త్రీ చేయని దుస్తులు ధరించి ఆఫీసులకు వస్తున్నారు. వాతావరణ మార్పులపై పోరాటం చేసేందుకు ‘స్వచ్ఛత పక్వాడ’లో భాగంగా ఈ నెల 1-15 తేదీల మధ్య ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి సోమవారం తాము వేసుకొనే దుస్తులను ఇస్త్రీ చేయకుండా ఉండటం ద్వారా విద్యుత్తును పొదుపు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా సంస్థ అన్ని ప్రయోగశాలలు, పని ప్రదేశాల్లో విద్యుత్తును పొదుపు చేయడం ద్వారా కరెంటు బిల్లును 10% తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. దీన్ని ఈ ఏడాది జూన్-ఆగస్ట్ మధ్యలో అమలు చేయనున్నారు. విద్యుత్తు పొదుపు కోసం తాము చేపట్టిన చొరవ ద్వారా వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన పెంచుతామని సీఎస్ఐఆర్ అధికారులు తెలిపారు. అతి చిన్న విషయాలు కూడా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల వల్ల కలిగే దుష్ఫలితాలను తగ్గించేందుకు ఎలా దోహదపడతాయో ప్రజలకు వివరిస్తామని వారు చెప్పారు.