Balka Suman | న్యూఢిల్లీ : బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ ఎన్ని కేసులు పెట్టినా.. తల వంచకుండా పోరాటం చేస్తామని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాల్క సుమన్ స్పష్టం చేశారు. కవిత మాసికంగా బలంగా ఉన్నారు అని తెలిపారు. తీహార్లో జైల్లో కవితతో ములాఖత్ అయిన తర్వాత సుమన్ మీడియాతో మాట్లాడారు.
విపక్ష నాయకులను అణిచివేయలనే అన్యాయంగా కవితను ఈ కేసులో ఇరికించారు. న్యాయస్థానాలపై నమ్మకం ఉంది. న్యాయం జరుగుతుందనే ఆశాభావంతో కవిత ఉన్నారు. బీజేపీకి ఎవరు ఎదురు ఉండకూడదనే ప్రతిపక్ష పార్టీలను భయబ్రాంతులకు గురిచేసింది. ఢిల్లీ లిక్కర్ కేసు కేసే కాదు.. అదొక పాలసీ… దాన్ని బూచిగా చూపించి తెలంగాణలో బీఆర్ఎస్, ఢిల్లీలో ఆప్ పార్టీని దెబ్బతీసే కుట్ర చేస్తున్నారు. ఇలాంటి కేసులతో ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేయొచ్చనే భ్రమలో బీజేపీ నేతలు ఉన్నారు.. కానీ భయపడే ప్రసక్తే లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా దెబ్బతిన్నది. బీజేపీ 220 సీట్లు దాటదు. వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే అని బాల్క సుమన్ స్పష్టం చేశారు.