భువనేశ్వర్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కరోనా కేసుల పెరుగుదలకు డబుల్ మ్యూటెంట్ కారణమన్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రాష్ట్రాలతో ఉన్న సరిహద్దులను మూసివేయడంతో పాటు ఆంక్షలను అమలులోకి తీసుకువచ్చింది. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలకు 14 రోజుల క్వారంటైన్ను తప్పని సరి చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్సీ మహాపాత్ర ఉత్తర్వులు జారీ చేశారు. సరిహద్దుల్లో ఒడిశాలోకి రాకుండా.. బయటకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని ఆరు జిల్లాల మెజిస్ట్రేట్లకు ఆదేశాలు జారీ చేశారు. వ్యక్తిగత, అద్దె వాహనాలు, రైళ్లు, విమానాల్లోనూ రాష్ట్రంలోకి ప్రవేశిస్తే బీడీఓ, ఎగ్జిక్యూటివ్ కార్యాలయాల నిర్వహణలోని క్లస్టర్ తాత్కాలిక వైద్య కేంద్రాల్లో ఉండాలని ఆదేశించారు.
అంతర్రాష్ట్ర రహదారులపై చెక్పోస్టులను ఏర్పాటు చేయాలని గంజాం, గజపతి, రాయగడ, కోరాపుట్, మల్కన్గిరి, నవరాంగ్పూర్ కలెక్టర్లను ఆదేశించారు. ఇదిలా ఉండగా.. ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్తో ఉన్న సరిహద్దులను సైతం ఇప్పటికే ఒడిశా ప్రభుత్వం మూసివేసింది. రాష్ట్రంలో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ లాక్డౌన్ విధించగా.. బుధవారం నుంచి అమలులోకి రాగా.. 19వ తేదీ వరకు అమలులో ఉండనుంది. విద్యా సంస్థలు, దుకాణాలు, సినిమా హాళ్ళు, మాల్స్, మార్కెట్ కాంప్లెక్స్, వ్యాయామశాలలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులు, థియేటర్లు, పార్కులు, బార్లు సహా అన్ని మూతపడ్డాయి. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు.