Khammam | ఖమ్మం, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం లోక్సభ స్థానానికి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ఆ పార్టీ నుంచి అనేకమంది నేతలు దరఖాస్తు చేసుకున్నారు. 25 రోజులపాటు వీరి మధ్య దోబూచులాడిన అభ్యర్థిత్వం ఎట్టకేలకు ఖరారైంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రఘురాంరెడ్డిని ఖమ్మం లోక్సభ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది. దీంతో టికెట్ ఆశించి భంగపడిన నేతల్లో నెలకొన్న అంసతృప్తి ఒక్కసారిగా భగ్గుమన్నది. కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని ఆశించిన మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు అనుచరులు శుక్రవారం కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సమావేశమై పోట్లకు టికెట్ ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. జిల్లాలో బలమైన సామాజికవర్గానికి చెందిన పోట్ల నాగేశ్వరరావు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవాలని ఆయన అనుచరుల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి వస్తున్నట్టు సమాచారం. 17 లోక్సభ స్థానాల్లో ఒక్క స్థానాన్ని కూడా కమ్మ సామాజికవర్గానికి కేటాయించలేదని చర్చించుకున్నారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాంరెడ్డిని పార్టీ ఖరారు చేసిన తర్వాత ఈ నెల 25న ఆయన నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసిన పొంగులేటి ప్రసాదరెడ్డి మినహా ఏ ఒక్కరూ హాజరు కాలేదు. ఉప ముఖ్యమంత్రి మల్లు కూడా గైర్హాజరవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సీనియర్ నేతలు పార్టీ ఇచ్చే ప్రాధాన్యాన్ని బట్టి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలా? వద్దా? అని భావిస్తున్నట్టు సమాచారం.
ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్లోని అసంతృప్తులను బుజ్జగించేందుకు పార్టీ ఖమ్మం లోక్సభ నియోజకవర్గ ఇన్చార్జి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అభ్యర్థి రఘురాంరెడ్డి రంగంలోకి దిగారు. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం చివరిరోజు కావడంతో.. రెబల్ నామినేషన్లను ఉసంహరింపజేసేందుకు కాంగ్రెస్ నేతలు పోట్ల నాగేశ్వరరావు, యాదయ్యలతో మంతనాలు జరుపుతున్నారు.