Congress | హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజలు పవిత్రంగా భావించే గన్పార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద కాంగ్రెస్ నాయకులు అవమానకర రీతిలో ప్రవర్తించారు. అమరుల త్యాగాలను లెక్కచేయకుండా చెప్పులేసుకొని స్థూపం వద్ద హంగామా సృష్టించారు. ఏకంగా చెప్పులేసుకొనే స్థూపం గద్దె పైకి ఎక్కి మీడియాతో మాట్లాడారు. శుక్రవారం ఉదయం మాజీ మంత్రి హరీశ్రావు తన రాజీనామా పత్రంతో గన్పార్క్కు వచ్చి నివాళులు అర్పించిన అనంతరం.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నేతృత్వంలో పలువురు నాయకులు అమరుల స్థూపం శుద్ధిపేరుతో నానా యాగి చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కనీసం ఒక్క పువ్వును కూడా అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించలేదు. కానీ, బీఆర్ఎస్ నాయకులు అమరులకు సమర్పించిన పూలను కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ ఊడ్చిపడేశారు. పూల దండలను పక్కకు విసిరివేశారు. పువ్వులను చేతులతో కాకుండా కాళ్లతో నెడుతుండగా, కాంగ్రెస్ నాయకురాలు కొండ్రడు పుష్పలత కాలుజారి కిందపడ్డారు. పక్కనే ఉన్న మీడియా ప్రతినిధులు ఆమెను లేపి, సపర్యలు చేశారు. పసుపు నీళ్లతో స్థూపాన్ని శుద్ధిచేసే క్రమంలో కాంగ్రెస్ నాయకులు తమపై నీళ్లు చల్లుకున్నారు. అనంతరం అమరుల స్థూపం మెట్లపై చెప్పులు వేసుకుని మీడియాతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ముందుకు రాగా.. తప్పు తెలుసుకొని చెప్పులు విప్పేసి మాట్లాడారు.
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడుతుండగా కాంగ్రెస్ మహిళానేత, సినీనటి దివ్యవాణి చెప్పులతో అమరుల స్థూపం పైకి ఎక్కారు. ఆమెతోపాటు మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ సైతం షూతో నిలుచొనే మీడియాతో మాట్లాడారు. ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్ పక్కన ఉన్న మరో నేత కూడా స్థూపంపై చెప్పులు ధరించే మాట్లాడారు. ఒక్క కాంగ్రెస్ నేత, కార్యకర్త కూడా ‘జై తెలంగాణ’ అని నినదించలేదు.