హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ)/చిక్కడపల్లి: దళిత జనోద్ధరణకు చిత్తశుద్ధితో పాటుపడిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణతోనే మాదిగ సామాజిక వర్గం అన్ని రంగాల్లో రాణిస్తుందనే దృఢమైన ఆలోచన ఉన్నది బీఆర్ఎస్ పార్టీకేనని, అందులో భాగంగానే రెండుసార్లు అసెంబ్లీ తీర్మానం చేశామని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వయంగా ప్రధాని మోదీని కలిసి వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపాలని కోరామని ఉదహరించారు. ఆదివారం హైదరాబాద్లోని హరీశ్రావు నివాసంలో తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్, పలువురు సంఘం నాయకులు ఆయనతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గకరణ అంశం ఇతర రాజకీయ పార్టీలకు ఎన్నికల సమయంలోనే గుర్తుకొస్తుందని, బీఆర్ఎస్కు మాత్రం జీవన విధానంగా మారిందని వివరించారు. జాతీయ స్థాయిలో ఈ అంశం తేలకపోతే, రాష్ట్ర పరిధిలోనైనా వర్గీకరణ చేసుకొనే అవకాశం కల్పించాలని కేంద్రాన్ని కోరామని గుర్తుచేశారు. కేంద్రం ఆ వెసులుబాటు కల్పించి ఉంటే ఇప్పటికే వర్గీకరణ మన రాష్ట్రంలో అమలవుతూ ఉండేదని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై వెనుకడుగు వేయబోమని, అసెంబ్లీలో, పార్లమెంట్లో గట్టిగా పోరాటం చేస్తామని అభయమిచ్చారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని బీజేపీ పేర్కొన్నా, ఆ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చలేదని, పదేండ్లు అధికారంలో ఉన్నా బిల్లుపై ఊసెత్తలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మాదిగలతోపాటు అన్ని సామాజికవర్గాలను గత పదేండ్లుగా బీజేపీ వాడుకున్నదని, ఆ పార్టీకి మాదిగల ఓట్లు అడిగే నైతికహక్కే లేదని మండిపడ్డారు. దళితుల్లో అత్యధికంగా ఉన్న మాదిగ సామాజికవర్గానికి కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వకుండా మాదిగ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ గెలుపుతోనే దళితులకు మేలు: వంగపల్లి
దళితవర్గాల ప్రయోజనమే తెలంగాణ ప్రయోజనంగా భావించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మొదటి నుంచి దళిత వర్గాలకు అన్ని రకాలుగా అండదండలు అందించారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో మాదిగ సామాజిక వర్గం తీరని వేదనకు గురవుతున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో తామంతా బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. మాదిగల ఆత్మగౌరవాన్ని హేళన చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు తగిన బుద్ధిచెప్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు, వివిధ జిల్లాల అధ్యక్షులు పుట్టపింజర రమేశ్, బంగారు శ్రీనివాస్, వేణుగోపాల్, కృష్ణ, సీహెచ్ గణేశ్, ఈదునూరి యాకయ్య, రాజేశ్ఖన్నా, నందిగామ నర్సింహా తదితరులు పాల్గొన్నారు.