Bonus | హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): వ్యవసాయశాఖలో ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే వరిసాగు విస్తీర్ణం తగ్గింపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తున్నది. ఇటీవల నిర్వహించిన సమీక్షలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు ఊతమిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 75 శాతం విస్తీర్ణంలో మూడు పంటలు మాత్రమే సాగవుతున్నాయి. ఇతర పంటల సాగుపెంచి వాటికి కూడా మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని మంత్రి పేర్కొన్నారు. ఇతర పంటల సాగుపెంచితే ఆ మేరకు మెజార్టీ పంటల విస్తీర్ణం తగ్గించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఇతర పంటల సాగు పెంచడం ద్వారా వరికి ఇచ్చే బోనస్ నుంచి తప్పించుకోవచ్చన్న ఆలోచన కూడా ఉన్నదని తెలుస్తున్నది.
వరిపైనే తొలి దెబ్బ
మంత్రి పేర్కొన్నట్టు ఇతర పంటల సాగును పెంచితే దాని ప్రభావం తొలుత పడేది వరిసాగుపైనేనన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. రాష్ట్రంలోని మొత్తం పంటల సాగులో 75 శాతం మూడు పంటలకే పరిమితమైందన్న మంత్రి వ్యాఖ్యల్లో నిజముంది. దీనివెనక ఒక కారణం కూడా ఉన్నది. ఇతర పంటలకు సరైన మద్దతు ధర రాకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నది అన్నదాతల మాట. ఇతర పంటలకు మద్దతు ధర కల్పించేందుకు ఆయా పంటల సాగును పెంచే దిశగా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అప్పుడు ఇతర పంటల సాగును పెంచేందుకు వరి, పత్తిసాగును తగ్గించాల్సి ఉంటుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో వరి, పత్తిసాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. మరీ ముఖ్యంగా కాళేశ్వరం పూర్తయ్యాక వరిసాగు విస్తీర్ణం బాగా పెరిగింది. 2014-15లో 34 లక్షల ఎకరాలున్న వరిసాగు విస్తీర్ణం, 2022-23లో ఏకంగా 1.21 కోట్ల ఎకరాలకు పెరిగింది. గత వానకాలంలో వానకాలంలో 1.36 కోట్ల ఎకరాల్లో పంటలు సాగుకాగా, అందులో వరి 64.54 లక్షల ఎకరాల్లో, పత్తి 50 లక్షల ఎకరాల్లో సాగైంది. మొత్తం పంటల సాగులో ఈ రెండింటి వాటా ఏకంగా 84 శాతం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి చెప్పిన ఆ రెండు పంటలు వరి, పత్తేనని స్పష్టమవుతున్నది. ఈ నేపథ్యంలో ఇతర పంటల సాగును పెంచాలంటే వరి, పత్తిసాగుపై ఆంక్షలు పెట్టక తప్పని పరిస్థితి ఎదురవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.
బోనస్, కరెంట్, నీళ్ల నుంచి తప్పించుకునేందుకేనా?
మద్దతు ధర సాకుతో ఇతర పంటలను ప్రోత్సహించి వరి, పత్తిని తగ్గించాలనే ఆలోచన వెనుక పెద్ద కుట్ర ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరిసాగు ఇలాగే కొనసాగినా, ఇంకా పెరిగినా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేక సవాళ్లు ఎదురవుతాయని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బోనస్, సాగు నీళ్లు, కరెంట్ రూపంలో ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని అంటున్నారు. వరి సాగు పెరిగితే ప్రభుత్వానికి ఆర్థికంగా మరింత భారం పెరుగుతుంది. సాగునీళ్లు, కరెంట్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోయాయనే సాకుతో ప్రభుత్వం కాళేశ్వరం నీళ్లు పొలాలకు అందకుండా చేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులోనైనా కాళేశ్వరం ద్వారా నీళ్లు అందిస్తారో, లేదో తెలియని పరిస్థితి నెలకొన్నది. వరిసాగుకు అవసరమైన విద్యుత్తు కూడా ఈ ప్రభుత్వం సరఫరా చేస్తుందో లేదోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వరికి క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. ఈ లెక్కన ప్రతిఏటా కనీసం కోటి టన్నుల ధాన్యం కొనుగోలు చేసినా బోనస్ కోసం ఏకంగా రూ. 5 వేల కోట్ల నిధులు అవసరం అవుతాయి. ఈ విధంగా బోనస్ వల్ల వచ్చే ఆర్థిక భారం, కరెంట్, నీళ్లు ఇవ్వడం నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం వరిసాగుపై ఆంక్షలు పెట్టేందుకు సిద్ధమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రైతులకు మళ్లీ కష్టాలు
ఒకవేళ ఇతర పంటలను ప్రోత్సహించి వరిసాగును తగ్గిస్తే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణలతో రైతులు భరోసాగా బతుకుతున్నారు. పుష్కలంగా నీళ్లు, సాగుకు అవసరమైన కరెంట్, రైతుబంధు పెట్టుబడి సాయం, సకాలంలో ఎరువుల పంపిణీ.. ఇలా అన్ని విధాలుగా రైతులకు అనుకూల పరిస్థితులున్నాయి. సాగునీళ్లు, కరెంటు ఇవ్వడంతో రైతులు వరి సాగుకు మొగ్గుచూపారు. ప్రతి రైతుకు ప్రతి సీజన్లో ఆరు నెలలు తిరగకముందే వరి సాగుతో రూ. లక్షల ఆదాయం వస్తున్నది. దీంతో పాటు ఒకప్పుడు బుక్కెడు బువ్వ కోసం ఎదురు చూసిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగారు. దేశానికి తెలంగాణ అన్నపూర్ణగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వరిసాగుపై ఆంక్షలు పెడితే రైతుల బతుకులు ఆగం కావడంతో పాటు తెలంగాణ మళ్లీ ఆకలికి ఏడ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే అందోళన వ్యక్తమవుతున్నది.