Congress | హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టుల ప్రాపకం కోసం పాకులాడుతున్నది. ఇప్పటికే సీపీఐని తమ దారిలోకి తెచ్చుకున్న కాంగ్రెస్.. లోక్సభ ఎన్నికల్లో సీపీఎంతో పొత్తు కుదుర్చుకునేందుకు వెంపర్లాడుతున్నది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు అలవిగాని హామీలతో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు ఇప్పుడు రాష్ట్రంలో అడుగడుగునా ఎదురుగాలి వీస్తుండటమే ఇందుకు కారణం.
ఇలాంటి పరిస్థితుల్లో ఇతరుల మద్దతు లేకపోతే పలు లోక్సభ స్థానాల్లో ఓటమి తప్పదని కాంగ్రెస్ ఆందోళన చెందుతున్నది. అందుకే సీపీఎంతో పొత్తు కుదుర్చుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి శనివారం తన నివాసంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతోపాటు ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి, వీరయ్యతో గంటకుపైగా సమావేశమై పొత్తుపై చర్చలు జరిపారు. కాంగ్రెస్తో పొత్తుకు అంగీకరించి అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో బేషరతుగా మద్దతిస్తే సీపీఎంకు ఓ ఎమ్మెల్సీ, ఓ జెడ్పీ చైర్మన్తోపాటు రెండు కార్పొరేషన్ పదవులను ఇస్తామని రేవంత్ ఆశచూపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ తమను అవమానించారన్న భావన సీపీఎం నేతల్లో బలంగా నాటుకుపోయింది. దీంతో రేవంత్పై ప్రతీకారం తీర్చుకునేందుకు వారంతా అదును కోసం వేచిచూస్తున్నారు. వారు కోరుకుంటున్న పరిస్థితి ఇప్పుడు లోక్సభ ఎన్నికల రూపంలో వచ్చింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క పది రోజుల క్రితం సీపీఎం కార్యాలయానికి వచ్చి మద్దతు కోరినా కామ్రేడ్లు ఒప్పుకోలేదు.
అసెంబ్లీ ఎన్నికలప్పుడు రేవంత్ స్వయంగా సీపీఐ కార్యాలయానికి వెళ్లి మద్దతు కోరిన విషయాన్ని వారు గుర్తుచేస్తూ.. ఇప్పుడు రేవంత్ తమ కార్యాలయానికి ఎందుకు రావడం లేదని ప్రశ్నించినట్టు తెలిసింది. రేవంత్ స్వయంగా తమను సంప్రదించి అడిగితే కాంగ్రెస్కు మద్దతు తెలుపడంపై ఆలోచిస్తామని భటి విక్రమార్కకు తేల్చిచెప్పినట్టు సమాచారం. దీంతో గత్యంతరం లేకనే రేవంత్ సీపీఎం నేతల బృందాన్ని తన ఇంటికి ఆహ్వానించి చర్చలు జరిపినట్టు వినికిడి.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో మద్దతు ఇవ్వాలని కోరిన రేవంత్కు సీపీఎం ఝలక్ ఇచ్చింది. ఇప్పటికే భువనగిరిలో తమ అభ్యర్థిగా మహమ్మద్ జహంగీర్ను నిలబెట్టిన సీపీఎం.. అక్కడ పోటీలో కొనసాగాలనే నిర్ణయించింది. ఈ ఒక్క స్థానం తప్ప మిగిలిన 16 స్థానాల్లో కాంగ్రెస్కు మద్దతిస్తున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. కానీ, రేవంత్కు అత్యంత ప్రధానమైన స్థానాల్లో భువనగిరి ఒకటి. అందుకే ఆయన తన సన్నిహితుడైన చామల కిరణ్కుమార్రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇప్పించుకున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో చామల ఓడితే పార్టీలో రేవంత్కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో చామలను ఏవిధంగానైనా గెలిపించుకునేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆయన మద్దతు కోసం సీపీఎంను ప్రాధేయపడినట్టు తెలుస్తున్నది. దీనితోపాటు రేవంత్ ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఇంటికి వెళ్లడం.. ఆయన సోదరుడు వెంకట్రెడ్డి సీఎం పదవికి అర్హుడంటూ మాట్లాడడం కూడా చామలను గెలిపించుకునేందుకేనన్న అభిప్రాయాలున్నాయి.