వరంగల్, మార్చి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎమిమిది జాబితాలు విడుదల చేసినా.. అందులో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఎవరనేది కాంగ్రెస్ తేల్చలేదు. ఈ స్థానంకోసం ఎవరికివారుగా ఆశావహులు ఒక్కో ముఖ్యనేత అండదండలతో తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తుండడంతో అధిష్టానానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. అధికార పార్టీ అన్ని పార్టీలకంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా, ఇక్కడ విరుద్ధంగా ఉండడం ఆ పార్టీలో ‘ఆధిపత్య’పోరును బహిర్గతం చేస్తున్నది.
Warangal | కాంగ్రెస్ పార్టీలో వరంగల్ లోక్సభ టికెట్ పంచాయితీ ఎంతకీ తెగడం లేదు. దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ తాజాగా ఎనిమిదో జాబితా విడుదల చేసింది. ఇప్పటి వరకు 209 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్ లోక్సభ అభ్యర్థిని మాత్రం ఖరారు చేయలేదు. తెలంగాణలోని మొత్తం 17 సీట్లలో 13 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. సాధారణంగా ఎన్నికల పోరు వ్యూహంలో అధికార పార్టీ ముందుంటుంది. ప్రతిపక్షాల కంటే ముందుగా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండేది. లోక్సభ ఎన్నికల్లో మాత్రం దీనికి విరుద్ధంగా జరుగుతున్నది. బీఆర్ఎస్ కడియం కావ్యను, బీజేపీ అరూరి రమేశ్ను ఇప్పటికే తమ అభ్యర్థులుగా ప్రకటించాయి. కాంగ్రెస్ ముఖ్యనేతల మధ్య సయోధ్య లేకపోవడంతో వరంగల్ ఎంపీ టికెట్ వ్యవహారం కొలిక్కి రావడంలేదు. కాంగ్రెస్లో వరంగల్ టికెట్ పంచాయితీ తీవ్రమవుతున్నది. కొత్తగా చేరిన వారు, పార్టీలోని పాత వారి మధ్య పోరు ముదురుతున్నది. ఈ పార్టీలోని రాష్ట్ర స్థాయి ముఖ్యనేతలు ఒక్కొక్కరు ఒకరికి మద్దతు ఇస్తున్నారు. దీంతో వరంగల్ ఎంపీ టికెట్ కేటాయింపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ లోక్సభ టికెట్ కోసం ఏడుగురు నేతలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఎవరికివారు టికెట్ తమకే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలే కాంగ్రెస్లో చేరిన సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్, శనిగపురం ఇందిర, దొమ్మాటి సాంబయ్య, రా మగల్ల పరమేశ్వర్, బక్క జడ్సన్, జన్ను పరంజ్యోతి, నమిండ్ల శ్రీనివాస్ టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. వీరందరూ తలా ఒక పెద్ద నేత దీవెనలతో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి, వరంగల్ ఉమ్మడి జిల్లా మంత్రి ఇలా నలుగురు ముఖ్యులు తమ సన్నిహితులకు టికెట్ ఇప్పించేందుకు ఏఐసీసీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ ఎంపీ టికెట్ కేటాయింపు వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్లోని ముఖ్య ప్రజాప్రతినిధులకు ఆధిపత్య పోరులాగా మారింది.
వరుసగా రెండుసార్లు బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ ఇటీవలే కాంగ్రెస్లో చేరారు. ఏఐసీసీ స్థాయిలో టికెట్పై హామీతోనే పసునూరి కాంగ్రెస్లో చేరినట్లు తెలిసింది. ఢిల్లీలోని పరిచయాలతో పసునూరి దయాకర్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన తనకు కాంగ్రెస్ టికెట్ ఇస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, కాంగ్రెస్ అధిష్టానం వరంగల్ అభ్యర్థిత్వం కోసం పసునూరి పేరును పరిశీలించడంపై ఆ పార్టీ పాత నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చా ర్జి శనిగపురం ఇందిర వరంగల్ ఎంపీ సీటు కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇందిర 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇందిరకు కర్ణాటకలో వ్యాపారాలు ఉన్నాయి. వరంగల్ ఎంపీ సీటు కోసం ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో ప్రయత్నాలు చేయిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ రాష్ట్రంలో రెండు చొప్పున సీట్లను మహిళలకు కేటాయించాయని, ఇదే ఫార్ములాతో తనకూ అవకాశం వస్తుందని ఆమె చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన దొమ్మాటి సాంబయ్య టికెట్పై ధీమాతో ఉన్నా రు. సీఎం రేవంత్రెడ్డి సన్నిహితుడిగా సాంబయ్యకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్రెడ్డితోనే సాంబయ్య కాంగ్రెస్లో చేరారు.
గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. అప్పుడు పార్టీ తరఫున పోటీ చేసిన తనకు రెండోసారి అవకాశం వస్తుందని నమ్మకంతో ఉన్నారు. రామగళ్ల పరమేశ్వర్ వరంగల్ ఎంపీ కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బక్క జడ్సన్ సీటు ఆశిస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ విధేయుడిగా ఉన్న తనకు ఏఐసీసీ ఎంపీ టికెట్ ఇస్తుందని చెబుతున్నారు. వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం లో పార్టీ కోసం పనిచేసిన పీసీసీ ప్రధాన కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. శ్రీనివాస్కు అవకాశం ఇవ్వాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట సెగ్మెంట్లో కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అవకాశం ఇచ్చారని, ఇప్పుడు తనకు ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరిన జన్ను పరంజ్యోతి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ మంత్రి అండదండలతో కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తున్నా రు. వర్ధన్నపేట అసెంబ్లీ టికె ట్ ఆశించి భంగపడిన పరంజ్యోతి ఎంపీ సీటు వస్తుందని నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్లో వరంగల్ ఎంపీ సీటు కోసం పోటీ ఎక్కువగా ఉండడంతో టికెట్ రాని వారు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉన్నదని పార్టీ హైకమాండ్ ఆందోళనతో ఉన్నది. టికెట్ దక్కని వారిని బుజ్జగించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నది. ఎక్కువ మంది నేతలు మాత్రం టికెట్ కోసమే పట్టుబడుతున్నారు. వరంగల్ అభ్యర్థి ఖరారైన తర్వాత కాంగ్రెస్లో అసలైన రాజకీయాలు మొదలయ్యే పరిస్థితి కనిపిస్తున్నది.