పాపన్నపేట, మే 2: సాధ్యంకాని హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి విమర్శించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల కేంద్రంలో గురువారం ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇందులో ఏవీ అమలు చేయడం లేదని ఆరోపించారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చేయకపోగా, ధాన్యం సరిగ్గా కొనుగోలు చేయడం లేదని విమర్శించారు. మహిళలకు రూ.2500 ఇస్తామన్నారని, రూ. 500కే గ్యాస్ సిలిండర్ అని చెప్పి ఏదీ అమలు చేయడం లేదని పద్మాదేవేందర్రెడ్డి ఆరోపించారు. మెదక్ లోక్సభ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రజలను ఆమె అభ్యర్థించారు. ఆమె వెంట మాజీ సర్పంచ్ గురుమూర్తిగౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, ఏడుపాయల దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు సుంకర శివయ్య, సాయిరెడ్డి, ఉప్పరి వెంకటేశం, రంగంపేట శీను తదితరులు ఉన్నారు.