చండూరు/చౌటుప్పల్, సెప్టెంబర్ 7: మునుగోడు నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారు. బుధవారం చండూరు మండలం తిమ్మారెడ్డిగూడేనికి చెందిన కాంగ్రెస్ ఉపసర్పంచ్ జక్కలి ముత్తయ్యతోపాటు మరో పది మంది, గుండ్రపల్లికి చెందిన ఇద్దరు మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. గట్టుప్పల్కు చెందిన 50 మంది టీఆర్ఎస్లో చేరారు. చౌటుప్పల్కు చెందిన 200 మంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు.. సంస్థాన్ నారాయణపురం మండలం పల్లగట్టుతండా బీజేపీ వార్డుసభ్యుడు.. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
గుడి చందాకుపోతే బీజేపీ కండువా కప్పిండ్రు..
బీరప్ప గుడి నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి చందా ఇస్తానని చెప్పడంతో మర్రిగూడ మండలంలోని వట్టిపల్లికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నీల శంకరయ్య బుధవారం వెళ్లగా బీజేపీ కండువాలు కప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో కుల పెద్దల మాట కాదనలేక బీజేపీ కండువా కప్పుకోవాల్సి వచ్చిందని శంకరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వట్టిపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు కొంపెల్లి నాగరాజుగౌడ్ ఆధ్వర్యంలో తిరిగి ఆయన టీఆర్ఎస్లో చేరారు.