జూబ్లీహిల్స్, మే 2: జూన్ 2 తరువాత హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సంచలన ఆరోపణలు చేశారు. పదేండ్లుగా అన్ని వర్గాల ప్రజలతో ఆనందంగా ఉన్న హైదరాబాద్ను కుక్కలు చింపిన విస్తరిలా చేయాలని చూ స్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభు త్వ కుటిల యత్నాలను తిప్పి కొట్టేందుకు ప్రజలంతా ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. గురువా రం ఆయన మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా మూసాపేటలో రోడ్షో నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజల మధ్య మతం చిచ్చుపెట్టి ఓట్లు దండుకునే పనిలో మోదీ, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను నయవంచన చేసేందుకు రేవంత్రెడ్డి మళ్లీ వస్తున్నారని దుయ్యబట్టారు. ‘పేగులు మెడలో వేసుకుని తిరుగుతా’, ‘పండబెట్టి తొక్కుతా’ అనే చిల్లర మాటలు తప్ప ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేదల కోసం చేసిందేమిటని నిలదీశారు.
నాడు కేసీఆర్ హైదరాబాద్ను అభివృద్ధి చేస్తే, నేడు రేవంత్ నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని విమర్శించారు. హైదరాబాద్కు కొత్త కంపెనీలు వచ్చుడు కాదు, బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన కంపెనీలు కూడా వెళ్లిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. మల్కాజిగిరిలో బీఆర్ఎస్కు కాంగ్రెస్తో పోటీయే లేదని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.