న్యూఢిల్లీ : కృష్ణా నదీ జలాల వివాదంపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్పై విచారణ జరిపింది. అయితే, ఏపీ పిటిషన్పై విచారణ అవసరం లేదని.. ఈ విషయంలో ఇప్పటికే కేంద్రం గెజిట్ జారీ చేసిందని తెలంగాణ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అక్టోబర్ నుంచి గెజిట్ అమలులోకి వస్తుందని తెలిపిన ఏపీ.. ఇప్పటి నుంచే గెజిట్ అమలు చేయాలని కోరుతున్నామని వాదించింది. నాలుగు నెలల పాటు నీటిని నష్టపోకూడదనే అడుగుతున్నామని పేర్కొంది. రెండు తెలుగు రాష్ట్రాలు సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ధర్మాసనం వివాదాన్ని సూచించింది.
పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినని, ఈ అంశంపై మధ్యవర్తిత్వంతో సమస్య పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాల సీనియర్ న్యాయవాదులకు సూచించారు. ఇందుకు సహకారం అందిస్తామని, లేదంటే పిటిషన్ను మరో బెంచ్కు బదిలీ చేస్తామన్నారు. ఇరువురు న్యాయవాదులు ప్రభుత్వాలను ఒప్పించి సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నానని, తాము అనవసరంగా జోక్యం చేసుకోవాలనుకోవడం లేదని సీనియర్ న్యాయవాదులతో చీఫ్ జస్టిస్ అన్నారు. నదీ జలాల వివాదంపై గతంలో వాదించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే సమయం కోరగా.. కేసు విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ కోర్టుకు హాజరయ్యారు.