ఆహారం, నిద్ర, భయం, మైథునం అనేవి మనిషికి నాలుగు సహజమైన విషయాలు. వీటిలో ఆహారం, నిద్ర, మైథునాలు సహజ అవసరాలైతే, భయం సహజ లక్షణం. భయం నుంచి తప్పించుకున్నవారు ఎవ్వరూ కనిపించరు. ఈ నాలుగు విషయాలు మానవులకే కాకుండా, పశుపక్ష్యాదులకూ సమానమే. అనివార్యంగా ఉండే భయానికి విరుగుడు ఇవ్వడానికే భాగవతం ఉదయించింది. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని భయాన్ని తొలగించడానికి మొట్టమొదటిసారి భాగవతం ప్రకటితమైంది. నారాయణుడి నాభికమలంలో ఆసీనుడైన బ్రహ్మ సృష్టి విషయంలో భీతావహుడైన సందర్భంలో అతనిపై కరుణతో చతుఃశ్లోకి భాగవతం ఉపదేశం జరిగింది. నిత్యం భాగవత ధ్యానంతో బ్రహ్మదేవుడు భయాన్ని వీడి సృష్టికార్యం కొనసాగించాడు. ఈ బృహత్తర కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వర్తిస్తున్నానని కలిగిన గర్వభయం కూడా భాగవత ధ్యానంతో తొలగిపోయింది.
బ్రహ్మ భయాన్ని తొలగించిన భాగవతాన్ని, జనుల భయాలను, కష్టాలను తొలగిస్తుందని ఆ దివ్య ఉపదేశాన్ని బ్రహ్మలోకం నుంచి భూలోకానికి తీసుకొని వచ్చాడు నారదుడు. భాగవత అమృతాన్ని ముందుగా వ్యాస మహర్షికి తెలియజేసి ఆయన నైరాశ్యాన్ని పోగొట్టాడు. దాని మహత్తును సంపూర్ణంగా అనుభవించాడు వ్యాసుడు. ఆ భాగవత సుధను మాయా భయాన్ని తొలగించడానికి శుకమహర్షికి ఉపదేశించాడు. శుక మహర్షి ద్వారా భాగవత అమృతాన్ని గ్రహించి మృత్యుభయాన్ని జయించాడు పరీక్షితుడు. తర్వాత కలి భయంతో విచారానికి, అంతులేని చింతకు లోనైన శౌనకాది రుషులకు ఉపశమనం కలిగిస్తూ, నైమిశారణ్యంలో వారికి భాగవతాన్ని ఉపదేశించాడు సూత మహర్షి. ఈ విధంగా భయానికి విరుగుడుగా భాగవతం ఈ సృష్టిలో అవతరించింది.
‘మనిషి తన మనసును నిగ్రహించుకొని, పుష్కర తీర్థం, మథుర, ద్వారకలో ఉపవసిస్తూ భాగవతాన్ని పఠిస్తే సర్వభయాలకూ దూరం అవుతాడు’ అంటుంది భాగవతం (12.12.61). భాగవత రచయిత వ్యాసభగవానుడి అనుభవాన్ని గమనించినా ఆ పురాణం మహిమ మనకు స్పష్టంగా తెలుస్తుంది. తన గురువైన నారదముని ఆజ్ఞ మేరకు శ్రీకృష్ణుడి లీలలను వర్ణించడానికి ముందు వ్యాసుడు శ్రీకృష్ణుణ్ని గాఢంగా ధ్యానించాడు. ఆ ధ్యానంలో వ్యాసమహర్షికి సాక్షాత్తుగా శ్రీకృష్ణుడి దర్శనం కలిగింది. ఆ దర్శనంతోపాటుగా కృష్ణుడి వెనుక నీడలా ఉన్న మాయాశక్తి దర్శనమైంది. ఆ మాయ వెనుక నిలిచిన జీవుడూ కనిపించాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడికి, జీవుడికి మధ్య మాయ వచ్చిందనే సత్యాన్ని ధ్యానంలో గ్రహించాడు వ్యాసుడు. మాయను దాటి శ్రీకృష్ణుడి ముందుకు చేరుకొని నేరుగా భక్తిలో నెలకొనడమే జీవుడి సమస్త దుఃఖాల వినాశనానికి ఏకైక మార్గం అని గుర్తించాడు మహర్షి. ఆ మాయా భయాన్ని జయించడానికి శ్రీమద్భాగవత రచనకు పూనుకున్నాడు. ఆ దివ్య భాగవత శ్రవణం వల్ల శోకమోహభయాలు నశించి కృష్ణభక్తి కలుగుతుందని భాగవత ఫలశృతిగా తెలియజేశాడు.
సమస్త వేద సాహిత్యాన్ని కలియుగంలో మానవాళికి అందించింది భగవదవతారమైన శ్రీల వ్యాసదేవుడే. ఆయన తన రచనలన్నీ పూర్తిచేసిన తర్వాత పరిపక్వ స్థితిలో గురుదేవుల ఆదేశం మేరకు చివరగా భాగవతాన్ని అందించాడు. సమస్త భయాలకు విరుగుడు భాగవతమేనని తెలియజేశాడు. అందుకే భయరహితులం కావాలంటే ఉన్న మార్గం భాగవతాన్ని ఆశ్రయించడమే. భాగవతాన్ని నిత్యం సేవించేవారికి మాయతెరలు తొలగిపోయి, భయాలన్నీ పటాపంచలవుతాయన్న మహత్తర సత్యం శీఘ్రమే అనుభవంలోకి వస్తుంది.
డా॥వైష్ణవాంఘ్రిసేవక దాస్
98219 14642