తిరుమల: తిరుమలలో (Tirumala) శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమాఢ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహించారు. అత్యంత వైభవంగా జరిగిన స్వామివారి స్వర్ణ రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. గోవింద నామాన్ని జపిస్తూ రథాన్ని లాగారు. రథోత్సవంలో పాల్గొనడం వల్ల లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలు.. భూదేవి కరుణతో సమస్త ధన్యాలు, శ్రీవారి కరుణాకటాక్షాలతో సర్వశుభాలు, సుఖాలు చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తారు.
తిరుమలలోని వసంతోత్సవ మండపంలో సాలకట్ల వసంతోత్సవాలు ఏప్రిల్ 21న (ఆదివారం) ప్రారంభమయ్యాయి. వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు వచ్చింది. ఎండ వేడిమి నుంచి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఉత్సవం కావడంతో దీన్ని ఉపశమనోత్సవం అని కూడా పిలుస్తారు. ఈ ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతోపాటు పలురకాల మధురఫలాలను స్వామివారికి నివేదిస్తారు.