బంజారాహిల్స్,ఏప్రిల్ 24: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో(Parliamentary elections) తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ సీట్లను బీఆర్ఎస్( BRS) పార్టీ సాధించడం ఖాయమని హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(MLA Gopinath,) ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్ ‘పోరుబాట’ పేరుతో చేపట్టిన బస్సు యాత్ర ప్రారంభోత్సవంలో బుధవారం ఎమ్మెల్యే మాగంటితో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ..నాలుగు నెలల కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అసలు నైజం బయటపడిందన్నారు.
ఆరు గ్యారెంటీలు అమలు చేయడం చేతగాక ప్రజలను మభ్యపెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీపై తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో పద్మారావు గౌడ్ను గెలిపించుకోవాలని ప్రజలంతా సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్ర మంలో కార్పొరేటర్లు రాజ్కుమార్ పటేల్, దేదీప్యరావు, వెల్దండ వెంకటేష్తో పాటు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.