Swarna Ratham | తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండోరోజైన సోమవారం మలయప్పస్వామి స్వర్ణ రథాన్ని అధిష్టించి శ్రీదేవి, భూదేవితో కలిసి తిరుమాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఉదయం 8 నుంచి 10 గంటల నడుమ అత్యంత వైభవంగా సాగిన స్వర్ణరథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని గోవిందనామాలు జపిస్తూ రథాన్ని లాగారు. స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ, భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భక్తుల విశ్వాసం. కార్యక్రమంలో ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, వీజీవో నంద కిశోర్ పాల్గొన్నారు.