బీజింగ్ : చైనా జనాభా 1.4 బిలియన్లకు చేరుకుందని బీజింగ్ వెల్లడించింది. ఈ నెల 11న దేశ జనాభా లెక్కలను ప్రకటించింది. చైనా దేశంలో గత దశాబ్ద కాలంలో జనాభా పెరుగుదల మందకొడిగా సాగిందని తేలింది. ‘వన్ చైల్డ్’ పాలసీని సడలించినప్పటికీ జనన రేటు కేవలం ఐదు శాతమే పెరిగింది. ఈ సందర్భంగా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ అధికారి నింగ్ జిజే మాట్లాడుతూ గత దశాబ్దంలో చైనా జనాభా స్వల్ప వృద్ధిని సాధించిందని తెలిపారు. పదేళ్లలో 5.4 శాతం పెరుగుదల నమోదైందని పేర్కొన్నారు. జనాభా పెరుగుదల, కదలికల సరళి తెలుసుకునేందుకు చైనా ప్రతి పదేళ్లకోసారి జనాభాను లెక్కిస్తుంది.
సుమారు ఏడు మిలియన్ల వలంటీర్లతో సర్వే చేపట్టగా.. గతేడాది డిసెంబర్లో పూర్తయింది. గతంలో జనన రేటుతో దేశంలో జనాభా సంక్షోభానికి దారితీస్తుందని చైనా భయపడింది. రాబోయే రోజుల్లో వృద్ధ జనాభా పెరిగి, శ్రామిక శక్తి తగ్గిపోతుందని ఆందోళనకు గురై 2016లో చైనా ప్రభుత్వం కుటుంబ నియంత్రణ నియమాలను మార్చి.. ఇద్దరు సంతానానికి అనుమతి ఇచ్చింది. అయినా.. వృద్ధాప్య జనాభాను భర్తీ చేసేందుకు ఆశించిన వృద్ధి నమోదవలేదు. ఇటీవలి కాలంలో వివాహల రేటు పడిపోవడం, ప్రధాన నగరాల్లో పిల్లలను పెంచేందుకు అధిక వ్యయం.. అలాగే మహిళా సాధికారతతో పిల్లలకు జన్మనివ్వడంలో ఆలస్యం కావడం.. నివారించడం సైతం కొంత కారణంగా భావిస్తున్నారు.