మొయినాబాద్, ఏప్రిల్ 25 : చిలుకూరు బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు ఎనిమిదో రోజు చక్ర తీర్థంతో ముగిశాయి. స్వామివారికి సర్వసైనాధిపతి అయిన చక్రస్వామి ఆధ్వర్యంలో చివరిరోజు ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పూర్ణాహుతి ప్రసాదాన్ని అష్టదిక్పాలకులకు నైవేద్యంగా పెట్టి బలిహరణం చేశారు. అంతకు ముందు స్వామివారిని శ్రీదేవీ, భూదేవి సమేతంగా అద్దాల పల్లకీలో ఊరేగించారు.
మండపంలో నవకలశ స్థాపనం, పాలికల పూజాతో దేవుళ్లందరినీ అవాహనం చేసి సుగంధద్రవ్యాలతో నవకలశ అభిషేకం చేశారు. అనంతరం చక్రస్వామికి ఆలయ సమీపంలోని గండిపేట చెరువులో చక్రస్నానం చేయించారు. కార్యక్రమానికి హాజరైన భక్తులందరికీ చక్రతీర్థాన్ని పంపిణీ చేశారు. ఉత్సవాల్లో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణస్వామి, అర్చకులు సీఎస్ రంగరాజన్, తిరుమల కిరణాచారి, పరావస్తు రామాచారి, నరసింహన్, కిట్టుస్వామి, కన్నయ్య, సురేశ్, అనిల్ పాల్గొన్నారు.