రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో గురువారం వాహనాన్ని ఐఈడీ సహాయంతో మావోయిస్టులు పేల్చి వేశారు. అందులో ప్రయాణిస్తున్న 12 మంది గాయపడ్డారు.. ఇందులో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. రాయ్పూర్కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాలెవాధి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘోటియా గ్రామం సమీపంలో ఉదయం 7.30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. నారాయణపూర్ నుంచి దంతెవాడను కలుపుతూ నిర్మిస్తున్న రోడ్డు మార్గంలో ఈ పేలుడు సంభవించిందని జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ తెలిపారు.
వాహనంలో ఉన్న మహిళతో సహా 12 మందికి గాయాలయ్యాయని, వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు ఎస్పీ పల్లవ తెలిపారు. భద్రతా దళాలే లక్ష్యంగా నక్సల్స్ ఐఈడీని పేల్చారని, పొరపాటున జనం వెళ్తున్న వాహనంపై దాడి చేసి ఉంటారని పేర్కొన్నారు. అయితే, ఆ మార్గంలో వెళ్లే సమయంలో పోలీసులు ఎప్పుడూ నాలుగు చక్రాల వాహనాలను వినియోగించరని తెలిపారు.