ఇల్లంతకుంట రూరల్, ఏప్రిల్ 17: పెండింగ్ బిల్లుల కోసం పాఠశాలకు తాళం వేసిన మాజీ సర్పంచ్ దంపతులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపటలో చోటుచేసుకున్నది. వల్లంపట్ల మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ-వెంకటనర్సింహారెడ్డి దంపతులు బీఆర్ఎస్ హయాంలో గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రూ.45 లక్షలతో రెండు తరగతి గదులు, వంటశాల నిర్మాణం చేపట్టారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ రెండేండ్ల నుంచి అధికారుల వద్దకు వెళ్లి ప్రాధేయపడినా కనికరించలేదు. ఈ క్రమంలో రూ.22లక్షల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని కోరుతూ గురువారం పాఠశాలకు తాళంవేశారు. హెచ్ఎం శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేసి పాఠశాల తాళాలు పగులగొట్టారు.
శుక్రవారం మాజీ సర్పంచ్ దంపతులిద్దరూ పాఠశాలకు వెళ్లి తాళం వేసి నిరసనకు దిగారు. ఎంఈవో శ్రీనివాస్ చేరుకుని డీఈవోకు ఫోన్ చేసి మాజీ సర్పంచ్ దంపతులతో మాట్లాడించారు. తమపై పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటేనే తాళాలు తీస్తామని వారు స్పష్టంచేశారు. కాంగ్రెస్ సర్పంచ్ ఒత్తిడి మేరకు ఎస్ఐ వచ్చి మాజీ సర్పంచ్ దంపతులను బలవంతంగా ఈడ్చుకుంటూ వాహనంలో ఎక్కించారు. పోలీసులు ఈడ్చుకెళ్తున్న క్రమంలో కేతిరెడ్డి అనసూయ చేతి గాజు పగిలి గీసుకుపోవడంతో తీవ్ర గాయమైంది. సాయంత్రం వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు.