అహ్మదాబాద్ : భారత మహిళల హాకీ జట్టుకు గుజరాత్లోని సూరత్కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి సావ్జీ ధోలాకియా బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఒలింపిక్స్ పతకం గెలుచుకొని వస్తే సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే జట్టు సభ్యులకు రూ.11లక్షలు ఇవ్వనున్నట్లు హెచ్కే గ్రూప్ అధినేత ప్రకటించారు. ఇండ్లున్న వారికి కారును బహూకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. టోక్యో-2020 ఒలింపిక్స్లో మహిళల జట్టు మంగళవారం జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఒడించి సెమీఫైనల్కు చేరిన సందర్భంగా ధోలాకియా ట్విట్టర్ ద్వారా ఈ ప్రకటన చేశారు. మహిళల హాకీ టీమ్ సాధించిన అద్భుతమైన విజయం గర్వంగా ఉందని, ఈ మేరకు జట్టు సభ్యులను సత్కరించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.
‘టోక్యోలో అమ్మాయిలు చరిత్ర సృష్టిస్తున్నారు.. మా క్రీడాకారుల మనోధైర్యం పెంచేందుకు ఇది మా వినయపూర్వక ప్రయత్నం’ అని పేర్కొన్నారు. ‘రాబోయే టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు సహాయ పడుతుంది’ అని ట్వీట్ చేశారు. అలాగే అమెరికాలో ఉన్న ఆయన సోదరుడు కమలేష్ దేవ్ సైతం విజేతలందరికీ రూ.లక్ష నగదు ప్రోత్సాహకం ఇస్తానని చెప్పారని ధోలాకియా తెలిపారు. దేశ ప్రజలు సైతం ముందుకు వచ్చి కీడ్రాకారులకు మద్దతివ్వాలని కోరుకుంటున్నానని, వారంతా దేశానికి మరింత కీర్తి తెచ్చేలా వారిని చైతన్యపరచాలి’ అంటూ పిలుపునిచ్చారు.
అయితే, బుధవారం జరిగిన మ్యాచ్లో అర్జెంటీనాపై 2-1తో భారత జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. కాంస్య పతకం కోసం మరో మ్యాచ్ గ్రేట్ బ్రిటన్తో తలపడనున్నది. సూరత్కు చెందిన వజ్రాల వ్యాపారి అయిన ధోలాకియా తన కంపెనీల్లో పనిచేసే ఉద్యోగస్తులకు ప్రతిఏడాదీ ఘనమైన దీపావళి కానుకలిస్తూ వస్తుంటారు. ప్రతి ఏడాది ఉత్తమ ప్రదర్శన చూపించిన ఉద్యోగులకు కార్లతో పాటు ప్లాట్లను సైతం ఇస్తుంటారు. ‘హరే కృష్ణ ఎక్స్పోర్ట్స్’ పేరుతో సావ్జీ వజ్రాల వ్యాపారం చేస్తున్నారు.