న్యూఢిల్లీ, మే 5: లోక్సభ మూడో దశ ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రంతో తెరపడింది. 11 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 92 స్థానాలకు ఈ నెల 7న(మంగళవారం) పోలింగ్ జరుగనున్నది. ఎన్డీయే కూటమికి ప్రతిష్ఠాత్మక రాష్ర్టాలైన, గత ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన గుజరాత్, ఛత్తీస్గఢ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ సహా పలు రాష్ర్టాల్లో ఈ మూడో దశ ఎన్నికలు జరుగనున్నాయి. 120 మంది మహిళలతో సహా 1,300 మందికి పైగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు.
ఈ మూడో దశ ఎన్నికల ప్రచారం ప్రధానంగా రిజర్వేషన్ల అంశం, ప్రజ్వల్ సెక్స్ స్కాండెల్ అంశాల చుట్టూనే నడిచింది. ప్రచారంలో అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి నేతలు ఆయా ఆంశాలపై ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను ముస్లింలకు ఇచ్చేస్తుందని ప్రధాని మోదీ సహా ఇతర బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు. దీనికి కౌంటర్గా.. కాంగ్రెస్, దాని మిత్రపక్ష పార్టీల నేతలు బీజేపీ కేంద్రంలోని వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తుందని, రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ ప్రచారం చేశారు.