KTR | కల్వకుర్తి : నాగర్కర్నూల్ ఎంపీ స్థానంతో పాటు 12 ఎంపీ సీట్లు గెలిపించి ఇవ్వండి.. ఆరు నెలల్లోనే కేసీఆర్ తిరిగి రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు.. గుంపు మేస్త్రీ ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది అని బీఆర్ఎస్ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని హైదరాబాద్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొని నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు మద్దతుగా ప్రసంగించారు.
ఐదు నెలల కిందట కల్వకుర్తి, ఆమన్గల్కు వచ్చాను. ఇట్లనే లొల్లి పెట్టారు. జైపాల్ యాదవ్ గెలిచిండు అనుకున్నా.. కానీ ఏదో మోసం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపిడితే మోసపోయారు. రెండు లక్షల రుణమాఫీ, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, రూ. 2500 ఇస్తా.. నేను నల్లబమల్ల బిడ్డను.. పాలమూరు బిడ్డను అని చెప్పి మోసం చేశారు అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
కల్వకుర్తి శివారులో కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఐదు గ్యారెంటీలు అమలు చేశామని హోర్డింగ్ పెట్టారు. మరి రుణమాఫీ అయిందా..? రైతు భరోసా వచ్చిందా..? రూ.15 వేలు వచ్చాయా..? తులం బంగారం వచ్చిందా..? ఆడబిడ్డలకు రూ. 2500 వచ్చాయా..? స్కూటీలు వచ్చాయా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. స్కూటీలు లేవు కానీ కాంగ్రెస్ లూటీ మొదలైంది. మోచేతికి బెల్లం పెట్టి ఓట్లు వేయించుకున్నాక పట్టించుకోవడం లేదు. సిగ్గు లేకుండా రేవంత్ మాట్లాడుతున్నాడు. ఐదు గ్యారెంటీలు అమలు చేశానని బొంకుడే కాకుండా కొత్త మంత్రం మొదలుపెట్టిండు. లంకె బిందెలు ఉన్నాయని వచ్చా.. కానీ ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయని అంటున్నాడు. లంకె బిందెల కోసం దొంగలు తిరుగుతారు. రోత మాటలు మాట్లాడుతున్నాడు. ఒక్కొక్క మాట మాట్లాడుతంటే ఇలాంటి వ్యక్తి మన సీఎం అయ్యాడా అని ఆశ్చర్యమేస్తోంది. పేగులు మెడలో వేసుకుంటా అంటున్నాడు. ఆయన ముఖ్యమంత్రా..? బోటి కొట్టేటోడా..? అని కేటీఆర్ ఎద్దెవా చేశారు.
రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్.. రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి అని మాట్లాడారు. మరి కల్వకుర్తిలో రియల్ ఎస్టేట్ ఎందుకు పెరగలేదు. ప్రభుత్వాన్ని నడుపుడు అంటే పాన్ డబ్బా నడిపినంతా ఈజీ కాదు. నోటికొచ్చినట్టు, ఇష్టమొచ్చినట్టు బూతులు మాట్లాడం కాదు. పరిపాలన అంటే దమ్ముండాలి. దక్షత ఉండాలి. అది ఉన్న నాయకుడు కేసీఆర్ కాబట్టి రియల్ ఎస్టేట్ పెరిగింది. భూముల ధరలు పెరిగాయి. పరిశ్రమలు వచ్చాయి. నీళ్లు వచ్చాయి. కళ్ల నుంచి కన్నీళ్లు రాలేదు. వాడేదో ఇస్తామనేసరికి ఆశపడ్డాం.. ఆగమైపోయం అని కేటీఆర్ పేర్కొన్నారు.