BRS Party | హైదరాబాద్ : బీఆర్ఎస్ మహిళా కార్యకర్త.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడారు. రేవంత్ రెడ్డి సర్కార్పై నిప్పులు చెరిగారు. మాయమాటలు చెప్పి.. ఓట్లు వేయించుకున్నారు.. ఇప్పుడేమో బూట్లు చూపిస్తున్నారని ఆ మహిళా కార్యకర్త మండిపడ్డారు. ఇకనైనా కళ్లు తెరిచి.. కారు గుర్తుకు ఓటేయాలని ఆమె తెలంగాణ ప్రజలను కోరారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ సమావేశంలో ఆ మహిళా కార్యకర్త పాల్గొని ప్రసంగించారు.
ఆ మహిళా ప్రసంగం ఆమె మాటల్లోనే.. కాంగ్రెసోళ్లు మసిబూసి మారేడు కాయ చేసి కండ్లకు గంతలు కట్టి ఆరు గ్యారెంటీల హామీలతో గట్టెక్కారు. ఓటు వేసినాక బూటు చూపిస్తున్నారు. రైతులను పట్టించుకోవడం లేదు. తాగేందుకు నీళ్లు ఇవ్వట్లేదు.. సాగుకు నీరందించడం లేదు. కేసీఆర్ పదేండ్ల నుంచి తెలంగాణను పదిలంగా కాపాడుకున్నారు. తెలంగాణ కోసం కేసీఆర్, కేటీఆర్ ఆనాడు ఉద్యమాలు చేసి, జైలుకు వెళ్లారు. లాఠీ దెబ్బలు తిన్నారు. ఆనాడు బీజేపోళ్లు, కాంగ్రెసోళ్లు జై తెలంగాణ అనలేదు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన హరితహారం, సంక్షేమ పథకాలు, అమ్మ ఒడి, ఆశావర్కర్లు, కంటి వెలుగు, రూ. 2 వేల పెన్షన్ వచ్చాయి.
మొన్న ఎన్నికలప్పుడు రూ. 4 వేల పెన్షన్, రూ. 2 లక్షల రుణమాఫీ అన్నావు. డిసెంబర్ 9న వాటిపై నిర్ణయం తీసుకుంటాం అన్నారు. కానీ ఏ పథకం అమలు కాలేదు. కేసీఆర్ గెలిచిన తర్వాత 2 కోట్ల 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. ఇవాళ 30 ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదు రేవంత్. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో నాడు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు నీళ్లు లేక. పొలాలు అమ్ముకుని దేశాలు పట్టిర్రు. బొంబాయి పోయారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఆ తర్వాత ఎకరా పొలం కోట్ల రూపాయాల్లో ధర పలికింది. ఇప్పుడు చెరువుల్లో, బావుల్లో నీళ్లు లేవు. బోర్లు వేసినా కూడా ఫలితం లేదు. పొలాలు నెర్రెలు పట్టాయి. 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కాంగ్రెసోళ్లు ఒక్కరూ పోలేదు. కేటీఆర్, హరీశ్రావు వ్యవసాయ పొలాల్లో తిరుగుతున్నారు. మన రామన్న రైతుల కోసం శ్రమిస్తుండు. కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పోయాయి. ఆరు పథకాల్లో ఒక్క పథకం అమలు కాలేదు. రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించుకునేందుకు కష్ట పడుదాం. కారు గుర్తుకు ఓటేయించుదాం.. కష్టపడి గెలిపించుకుందా. చేయికి ఓటు వేయకుండా చెమటోడ్చుదాం. లక్ష్మారెడ్డిని ఎంపీగా గెలిపించి కేసీఆర్, కేటీఆర్కు బహుమతిగా ఇద్దాం. ఇది ఒక్కటే కాదు.. ప్రతి బీఆర్ఎస్ ఎంపీని గెలపించుకుందాం. అయ్యా.. అమ్మా.. నా ప్రజలారా, రైతన్నలారా.. తప్పిదారి చేయికి ఓటు వేయకుండి. మీరు తవ్వుకున్న బొక్కలో మీరే పడ్డారు. ఇకనైనా కళ్లు తెరిచి కారు గుర్తుకు ఓటేయండి అని ఆమె తన ప్రసంగాన్ని ముగించారు. ఆమె ప్రసంగాన్ని కేటీఆర్తో పాటు అక్కడున్న నాయకులంతా ఆసక్తిగా విన్నారు.