షాబాద్, ఏప్రిల్ 25 : దేవుడిపై ఒట్లు.. కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు కాలం వెల్లదీస్తున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం చేవెళ్ల మండల కేంద్రంలో నూతనం గా ఏర్పాటు చేసిన పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్తో కలిసి ఆమె ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీ కార్డులు మీకు వచ్చాయా అని ప్రజలను అడగాలని.. రాకుంటే ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నా యకులను నిలదీయాలని సూచించారు. పదేండ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న మోసాలను వివరించాలని.. ఎవరైతే బీఆర్ఎస్ ఓడిపోతుందని ఇతర పార్టీల్లోకి వెళ్లి ఎగిరెగిరి పడుతున్నారో అలాంటి వారికి కచ్చితంగా బుద్ధి చెప్పాలన్నారు.
కారు గుర్తుకు ఓటేసి కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలంలో వివిధ కంపెనీలు, మొయినాబాద్లో 111 జీవో ఎత్తివేత, శంకర్పల్లిని హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. అనంతరం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ తనను చేవెళ్ల ప్రజలంతా ఎంపీగా ఆశీర్వదించి గెలిపిస్తే ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు గుర్తుండేలా తెలంగాణను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభివృద్ధి చేశారని కొనియాడారు. కాసాని జ్ఞానేశ్వర్ గెలుపుకోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జి రాంబాబుయాదవ్, సీనియర్ నేత గట్టు రాంచందర్రావు, డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ళ కృష్ణారెడ్డి, ఎంపీపీ గోవర్ధ్దన్రెడ్డి, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, మాజీ ఎంపీపీ మంగలి బాల్రాజ్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, పీఏసీఎస్ చైర్మన్ బద్దం శశిధర్రెడ్డి, పోలీస్ రాంరెడ్డి, మంగలి యాదగిరి, చందు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.