నల్లగొండ : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి (Jagdish Reddy) అన్నారు. గురువారం బీఆర్ఎస్ (BRS) నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా హాలియాలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు.
వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వకుండా పంట పొలాలను ఎండ బెట్టి, తాగు, సాగు, రుణమాఫీ, 500 రూపాయల బోనస్ఇ వ్వలేకపోయిందని ఆరోపించారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై జానారెడ్డి తో చర్చించేందుకు తాను సిద్ధమేనని, అందుకు జానారెడ్డి సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాతనే హాలియా నందికొండ మున్సిపాలిటీ చేయడంతో పాటు ప్రజలందరికీ తాగునీరు, సాగునీరు , 24 గంటల కరెంటు, హాలియాకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎత్తిపోతల పథకాన్ని తీసుకువచ్చిన ఘనత బీఆర్ఎస్దేనని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి , మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.