Traffic Jam | సిటీబ్యూరో, మే 1 (నమస్తే తెలంగాణ): ముందస్తు సమాచారం లేకుండా ఎక్కడికక్కడ రాచకొండలో రోడ్లు బ్లాక్ చేస్తుండటంతో ట్రాఫిక్లో చిక్కుకొని వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీలు ప్రచారాల కోసం ముందస్తుగానే అనుమతికి దరఖాస్తు చేయడం, ఆయా రూట్లలో పోలీసులు అనుమతులివ్వడం సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే ప్రముఖుల ప్రచారాల సందర్భంలో సభలు, సమావేశాలు జరిగే ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా పోలీసులు ముందస్తుగానే పరిగణలోకి తీసుకుంటారు.
ఇందులో భాగంగా ప్రధానంగా సామాన్యులు ఇబ్బందులు పడకుండా ఉండేలా ఏ రోజు ఏ పార్టీ మీటింగ్ ఉంటుందో..ఆ ప్రాంతంలో ట్రాఫిక్ను మళ్లిస్తున్నామంటూ.. ముందస్తుగా ప్రకటనలు జారీ చేస్తుంటారు. హైదరాబాద్, సైబరాబాద్లో ఇలాంటి ముందస్తు ప్రకటనలు వస్తున్నా.. కొన్ని సందర్భాల్లో రాచకొండలో ఈ విధానం అమలు కావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్, బడంగ్పేట పరిసరాల్లో మంగళవారం రాత్రి వివిధ పార్టీల కార్నర్ మీటింగ్లు జరిగాయి. దీంతో ప్రధాన రోడ్లన్నీ ఎక్కడికక్కడే జామ్ అయ్యాయి.
స్థానిక పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టాల్సి ఉన్నా.. అలా చేయకపోవడంతో ప్రధాన రహదారుల నుంచి రాకపోకలు సాగించే వారు నరకయాతన అనుభవించారు. శ్రీశైలం హైవే, ఎయిర్పోర్టుకు వెళ్లేవారు ఎక్కువగా బాలాపూర్ చౌరస్తా నుంచి ఆర్సీఐ రోడ్డు మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. బెంగళూర్ హైవేకు వెళ్లేవారు తుక్కుగూడ ఔటర్ మీదుగా పాలమాకులకు వెళ్లి అక్కడి నుంచి హైవేలో వెళ్తారు. ఈ కారణంగా బాలాపూర్, ఆర్సీఐ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. మంగళవారం ఆ రూట్లో వచ్చే వారికి అక్కడ మీటింగ్లు జరుగుతున్నాయని, రహదారులను మూసివేశారనే విషయం తెలియదు. ఏదో సాధారణ ట్రాఫిక్ జామ్గా భావించి..చాలా మంది కొద్దిసేపు ఎక్కడికక్కడే ఆగారు.
అరగంట, గంట.. రెండు, నాలుగు గంటలు.. ఇలా ఆ రోడ్డుపైనే ఉండాల్సి రావడంతో ప్రయాణికులు తీవ్ర ఆసహనం వ్యక్తం చేశారు. కడ్తాల్ నుంచి హైదరాబాద్కు కుటంబంతో వస్తున్న వైద్యుడు రమేశ్ ‘ఇదేం బాధర బాబు.. కనీసం ముందస్తు సమాచారం లేదు.. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి.. పోలీసులను అడిగితే ఆగాలంటూ హుకూం జారీ చేస్తూ ఇబ్బంది పెట్టారు. కుటుంబంతో నాలుగు గంటలు కారులోనే ఉండాల్సి వచ్చింది’.. అంటూ వాపోయారు. వ్యాపారి రత్నాకర్రెడ్డి ట్రాఫిక్లో ఇరుక్కుపోయి, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా వందల వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకుపోయాయి. పోలీసులు ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే..ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదంటూ.. ప్రయాణికులు వాపోయారు.