బడంగ్పేట (మహేశ్వరం) : కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజులు గడ్డు కాలమేనని, కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక బీఆర్ఎస్లో చేరుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి (Sabita Indra Reddy) అన్నారు. మహేశ్వరం మండలం గట్టు పల్లి గ్రామ ఉప సర్పంచ్తో పాటు మరి కొంత మంది ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే గులాబీ కాండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆమె మాట్లాడుతూ అలవి కాని హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress) పార్టీని ప్రజలు నమ్మడం లేదన్నారు. నాలుగు నెలల కాలంలో ఏ ఒక్క హమీని నెరవేర్చక పోవడంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు విశ్వాసం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అమలయిన పథకాలు ఇప్పుడు అమలు కావడం లేదని ఆరోపించారు. రైతు బంధు అందక, రుణ మాఫీ జరుగక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆమె పేర్కొన్నారు .
వేసవి కాలంలో కనీసం తాగునీటి (Drinking water) సమస్యను పరిష్కరించలేని పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. ఉన్న జల వనరులను ఎలా వాడుకోవాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియడం లేదన్నారు. రాష్ట్ర ప్రజలు తిరిగి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. చేవళ్ల పార్లమెంటు ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మహేశ్వరం అధ్యక్షుడు రాజు నాయక్, మండల యూత్ అధ్యక్షుడు శ్రీను, గ్రామ శాఖ అధ్యక్షుడు శంకరయ్య, మాజీ ఎంపీటీసీ శ్రీశైలం, సాజత్, తదితరులు పాల్గొన్నారు.