సిద్దిపేట, మే 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘మల్లన్నసాగర్ నుంచి నర్సాపూర్కు వచ్చే కాల్వల పనులు మనకు ముఖ్యం. ఆ కాల్వ పనులు మన బతుకుదెరువు.ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి నీళ్లు తేవాలంటే కచ్చితంగా ఎంపీగా వెంకట్రామిరెడ్డిని గెలిపించాలి. ఆయనతో పాటు మనమంతా యుద్ధ్దం చేయడానికి సిద్ధ్దంగా ఉండాలి’.. అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో కేసీఆర్ రోడ్షో కొనసాగింది. భారీగా జనం తరలివచ్చారు. ప్రజలనుద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ… కాల్వ పనులు పూర్తి చేసుకొని గోదావరి జలాలు పారించుకుని నర్సాపూర్ నియోజకవర్గాన్ని పచ్చగా చేసుకోవడం తన కల అని కేసీఆర్ పేర్కొన్నారు. నర్సాపూర్ మీద ఉండే ప్రేమతోని సునీతాలక్ష్మారెడ్డి గెలిచిన నాటి నుంచి ఆ కాల్వ పనులు స్పీడ్ పెంచి పని చేయిస్తున్నట్లు చెప్పారు. నర్సాపూర్ నియోజకవర్గానికి మల్లన్నసాగర్ నుంచి లింక్ కల్పించినట్లు చెప్పారు. లక్షా యాభై వేల ఎకరాలకు సాగునీరు అందాలని శంకరంపేట నుంచి కాల్వలు తవ్వుతున్నారని చెప్పారు. అవన్నీ మీ కండ్ల ముందు ఉన్నాయని, మల్లన్నసాగర్ నుంచి ఒక్కసారి నీళ్లు రావడం మొదలైతే నర్సాపూర్ బంగారు తునక అయితదని కేసీఆర్ ప్రజల హర్షధ్వానాల మధ్య చెప్పారు. ఆ పనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తదని నమ్మకం లేదన్నారు. ఆ పనులు పూర్తయి మల్లన్నసాగర్ నుంచి నర్సాపూర్కు గోదావరి నీళ్లు రావాలంటే మెదక్ ఎంపీగా వెంకట్రామిరెడ్డి భారీ మెజార్టీతో గెలవాలన్నారు. మనమంతా కలిసి యుద్ధ్దం చేయాలని, లేకపోతే ఈ ప్రభుత్వం నీళ్లు ఇచ్చేలా లేదని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, ఇక కూడా నెరవేరుస్తదనే ఆశ కూడా లేదన్నారు.
ఈ ప్రాంత ప్రజలకు తన చరిత్ర, మదన్రెడ్డి చరిత్ర తెలుసని కేసీఆర్ అన్నారు. మదన్రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్రయత్నం చేసి ఓడిపోయిండన్నారు. ఆయనను రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసింది తానే కదా అని కేసీఆర్ అన్నారు. 70 ఏండ్ల వయస్సులో ముసలితనానికి కుసుమ గుడాలు అన్నట్లు ఎవరిని ఉద్దరిద్దామని పోయినట్టు మదన్రెడ్డి.. ఏం చేద్దామని పోయినట్టు అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇది ధర్మమేనా? మనందరినీ విడిచిపెట్టి పోయిన మదన్రెడ్డికి మీరే బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. శాసనసభ ఎన్నికల కంటే పెద్ద మెజార్టీ ఇచ్చి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలన్నారు. భవిష్యత్తు మనదని, ఆలోచించి ఓటు వేయాలన్నారు. మనకు న్యాయం జరగాలన్నారు. నర్సాపూర్లో లంబాడ సోదరులు ఎక్కువ ఉన్నారన్నారు. తాను 50ఏండ్లు మొత్తుకుంటే ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా లంబాడీ తండాలను గ్రామ పంచాయతీలు చేయలేదన్నారు. గ్రామ పంచాయతీలు చేసింది తానే అని కేసీఆర్ గుర్తుచేశారు. నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు పంపించామన్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు పెట్టామని చెప్పారు. పోడు భూములిచ్చామని… ఆ భూములకు రైతుబంధు ఇచ్చామన్నారు. కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పోడు భూములకు రైతుబంధు రాలేదన్నారు. సమాజంలో ఏ ఒక్క వర్గం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయడం లేదన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే ఢిల్లీలో మన హక్కుల గురించి పోరాడుతారన్నారు. తెలంగాణ మొత్తంలో అతి ఎక్కువ మెజార్టీతో మీ అందరి దీవెనతో మెదక్ ఎంపీగా వెంకట్రామిరెడ్డి గెలుస్తున్నాడని కేసీఆర్ చెప్పారు. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కనీసం 40నుంచి 50వేల మెజార్టీ ఇవ్వాలని కోరారు. నర్సాపూర్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్షో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. పట్టణం గులాబీమయంగా మారింది. భారీగా జనం తరలివచ్చారు.
నర్సాపూర్ను ఎన్ని రకాలుగా అభివృద్ధి చేశానో మీ అందరికీ తెలుసని కేసీఆర్ చెప్పారు. నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 25 కోట్లు మంజూరు చేస్తే వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తే వాటిని వెనక్కి తీసుకుపోయిందన్నారు. కొల్చారం మండలంలో మల్లినాథ సూరి పేరు మీద యూనివర్సిటీ పెడుదామని అనుకున్నామని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పరిస్థితి లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేసిన నిధులను రద్దు చేయడమే తప్పా మరోటి ఈ ప్రభుత్వం చేయడం లేదన్నారు.ఇక ముందు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇచ్చేలా లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజీరా, హల్దీ వాగుల మీద ఎన్ని చెక్డ్యామ్లు కట్టించానో మీ అందరికీ తెలుసని, దాదాపుగా 10 చెక్ డ్యామ్లు కట్టించినట్లు కేసీఆర్ గుర్తుచేశారు. ఈ చెక్ డ్యామ్లతోని పంటలు బాగా పండించుకున్నామన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని దెబ్బతీసే పరిస్థితి వస్తా ఉందన్నారు. తాగునీరు, సాగునీరు ఇబ్బందులు మోపయ్యాయని, కరెంట్ సరిగ్గా రావడం లేదన్నారు. పేదలకు సంక్షేమం లేదని, ఈ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క హామీ అమలు అవుతుందన్న నమ్మకం లేదని కేసీఆర్ అన్నారు.