పటాన్చెరు, మే 17: గీతం వర్సిటీలోని స్ట్రాంగ్రూమ్లను శుక్రవారం రాష్ట్ర అదనపు ఎన్నికల కమిషనర్ లోకేశ్కుమార్ పరిశీలించారు. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన జహీరాబాద్ ఎంపీ ఎన్నికల స్ట్రాంగ్రూమ్లను ఆయన కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ రూపేశ్ కుమార్లతో కలిసి సందర్శించారు. స్ట్రాంగ్ రూంల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు. మూడంచెల సెక్యూరిటీ లాక్బుక్ రిజిస్టర్స్లను, ఈవీఎంల భద్రత ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల అదనపు కమిషనర్ లోకేశ్ కుమార్ పరిశీలించారు.
ఈ సందర్భంగా లోకేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా లోటుపాట్లకు తావులేకుండా కౌంటింగ్ కేంద్రం వద్ద పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారన్నారు. జిల్లా పోలీస్ విభాగం చేసిన ఏర్పాట్లు పారదర్శకంగా ఉన్నాయని తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం భద్రత కల్పించినట్టు చెప్పారు. ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద సాయుధ బలగాలతో పహారా ఏర్పాటు చేశారన్నారు. ఎలాంటి అనుమానాలకు తావులేకుండా స్ట్రాంగ్ రూమ్లకు భద్రత కల్పించామన్నారు. స్ట్రాంగ్రూమ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వాటితో పాటు పరిసరాలను అనుక్షణం పరిశీలించేందుకు వీలుగా సీసీ కెమెరాలను అమర్చినట్టు తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద, కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ నిషేధాజ్ఞలు అమలులో ఉన్నట్లు తెలిపారు.
ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి ఇతరులెవ్వరూ లోనికి వెళ్లకుండా కుట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను ఆయన ఆదేశించారు. గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ప్రతి కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్రూమ్ సీల్ను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. జూన్ 4న చేపట్టనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు.
కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది రాకపోకల కోసం వేర్వేరు మార్గాల్లో బారీకేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ సరఫరా, కౌంటింగ్ టేబుల్స్ ఇతర ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ.. ఈవీఎంలు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు అదనపు ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేసినట్టు వివరించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద అదనంగా జనరేటర్ ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. వారి వెంట ట్రైనీ ఐఏఎస్ మనోజ్, కామారెడ్డి ట్రైనీ ఐపీఎస్ కాజల్సింగ్, ప్రత్యేకాధికారి రవీందర్రెడ్డి, ఎన్నికల అధికారులు ఉన్నారు.