తిరుపతి : తిరుపతి (Tirupati) గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారు కల్పవృక్ష వాహనం ( Kalpavriksha vahanam) పై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన వాహనసేవ వైభవంగా జరిగింది. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాల కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
భక్తుల కోరికలు తీర్చే స్వామివారు ఈ కల్పవృక్షాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడని అర్చకులు తెలిపారు. అనంతరం స్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్సేవను నిర్వహించనున్నామని వివరించారు.
ఆదివారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి గరుడసేవ కార్యక్రమం జరుగుతుందని టీటీడీ (TTD) అధికారులు వివరించారు. వాహనసేవలో తిరుమల పెద్ద జీయర్స్వామి, చిన్న జీయర్స్వామి, ఆగమ సలహాదారులు సీతారామాచార్యులు, మోహన రంగాచార్యులు, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి పాల్గొన్నారు.