Balka Suman | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిందని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు. ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల మీద కాంగ్రెస్ కేసులు పెడుతుందని మండిపడ్డారు. గోదావరిఖనిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొప్పుల ఈశ్వర్, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్తో కలిసి ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పెద్దపల్లిలో వివేక్ వెంకటస్వామి కుట్రలపై మండిపడ్డారు.
వివేక్ కుటుంబం పెద్దపల్లిలో సామ్రాజ్యవాద విస్తరణకు కుట్ర చేస్తుందని బాల్క సుమన్ ఆరోపించారు. వ్యాపారాలు, పదవులు, ఆస్తులు కాపాడుకోవడానికి పెద్దపల్లిని వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. పెద్దపల్లి వివేక్ వెంకటస్వామికి సామంత రాజ్యం కాదని మండిపడ్డారు. వేల కోట్ల ఆస్తులున్న వివేక్ దమ్ముంటే జనరల్ సీట్లలో పోటీ చేయాలని సవాలు విసిరారు. పెద్దపల్లి ప్రాంత దళిత సామాజిక వర్గాలను వివేక్ కుటుంబం అణగదొక్కుతుందని అన్నారు