హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అమరవీరులను, అమరవీరుల స్థూపాన్ని అవమానపర్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అమరవీరుల త్యాగాల గురించి, అమరవీరుల స్థూపం గురించి రేవంత్రెడ్డికి ఏం తెలుసని ప్రశ్నించారు. శుక్రవారం తెలంగాణభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి లాంటి వారి వల్ల అమరవీరుల ఆత్మ ఘోషిస్తున్నదని విమర్శించారు. వారి త్యాగాలను అవమానించే విధంగా మాట్లాడిన ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమరవీరుల స్థూపాన్ని తాకే నైతిక హకు కాంగ్రెస్ పార్టీ నేతలకు లేదని స్పష్టంచేశారు. అమరవీరుల స్థూపం చరిత్ర ఏం తెలుసునని, కొందరు రేవంత్ చెంచాలు, బచ్చగాళ్లు అమరవీరుల స్థూపం మలినమైందని శుద్ధి చేస్తారా? అని ఫైరయ్యారు.
ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా బీఆర్ఎస్ ముందుగా అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి నివాళులు అర్పిస్తామని, స్థూపాన్ని దైవంతో సమానంగా భావిస్తామని చెప్పారు. అమరవీరుల త్యాగాల గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడటం చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నదని మండిపడ్డారు. ఒకనాడైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నావా? ఒకనాడైనా జై తెలంగాణ అన్నవా..రేవంత్రెడ్డి? అని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి తెలంగాణ ద్రోహి అని, చంద్రబాబుకు, సమైక్యవాదులకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు పదవులకు రాజీనామా చేయమంటే పారిపోయింది మీరు కాదా? అని నిలదీశారు. తెలంగాణ ఉద్యమకారులపైకి తుపాకీ ఎకుపెట్టిన మీరా.. తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడేది అని ప్రశ్నించారు. పదవులను గడ్డిపోచలా వదులుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నదని స్పష్టంచేశారు. హరీశ్రావుకు రాజీనామాలు ఏమైనా కొత్తనా? అని ప్రశ్నించారు.
1969 కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగంగానే ఆనాడు 369 మంది అమరులు అయ్యారని, అందుకే వారికి నివాళులుగా అమరవీరుల స్థూపాన్ని కట్టుకున్నామని ఎర్రోళ్ల చెప్పారు. అమరవీరుల స్థూపం 2014 ముందు హైదరాబాద్లో మాత్రమే ఉండేది, కానీ ప్రతి నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ప్రజలు స్వచ్ఛందంగా నిర్మించుకున్నారని గుర్తుచేశారు. కేసీఆర్ లేకపోతే ముఖ్యమంత్రి అయ్యేవాడివా… తెలంగాణ రాకపోతే అదే సమైక్యవాదుల అడుగులకు మడుగులు వత్తేవాడివని రేవంత్పై నిప్పులు చెరిగారు. గతంలో కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి, మాటతప్పి మళ్లీ మల్కాజిగిరిలో పోటీచేసింది నువ్వు కాదా? అని రేవంత్ను నిలదీశారు. పంద్రాగస్టున 2 లక్షల రుణమాఫీతోపాటు 8 గ్యారెంటీలు అమలు చేయాలని, లేదంటే కొడంగల్ ప్రజలను మోసం చేసినట్టుగా అందరినీ మోసం చేసినట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తారని చెప్పారు.