KCR | బండి సంజయ్కు వినోద్కుమార్కు ఏదైనా పోలిక ఉందా.. ఆయన మాట్లాడితే ఏమైనా అర్థం అవుతుందా అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. బండి సంజయ్ మాట్లాడేది ఏం భాషా.. హిందీనా? ఇంగ్లీషా? తెలుగా? అని ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర శుక్రవారం నాడు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని సిరిసిల్ల పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా సిరిసిల్ల పాత బస్టాండ్ దగ్గర కార్నర్ మీటింగ్లో కేసీఆర్ మాట్లాడుతూ.. కరీంనగర్ పార్లమెంటు కోసం వినోద్కుమార్ అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. పార్లమెంటులో కొట్లాడారని తెలిపారు. తెలంగాణ సాధన కోసం 2001 నుంచి తనతో పాటు ఉన్నారని పేర్కొన్నారు. కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడం కోసం తనతో పాటు కష్టపడుతున్నారని చెప్పారు.
అలవికాని హామీలిచ్చి.. అరచేతిలో వైకుంఠం చూపించి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఇష్టమొచ్చిన మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఒక్క హామీ అయినా అమలు చేసిందా? అని ప్రశ్నించారు. మహిళలకు రూ.2500, రైతులకు 2 లక్షల రుణమాఫీ.. ఇలా ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు. ఒకే ఒక్క మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ పెట్టారు.. దాంతో బస్సుల్లో ఆడవాళ్లు సర్కాస్ చేసినట్టు తన్నుకుంటున్నారని. ఆటో డ్రైవర్లు అన్నమో రామచంద్రా అని ఏడుస్తున్నారని తెలిపారు.
మొత్తం రైతాంగాన్ని కాంగ్రెస్ వంచించిందని కేసీఆర్ అన్నారు. రైతుబంధు రాలేదు.. నీళ్లు రాలేదు.. కరెంటు రాలేదు.. మరమగ్గాలు మూలపడే పరిస్థితి, చేనేత కార్మికులు చచ్చిపోయే పరిస్థితి.. ఇలా ఎవర్నీ ఆదుకున్న పరిస్థితి లేదని మండిపడ్డారు. ఆరు గ్యారంటీల్లో కాంగ్రెస్ ఏదీ అమలు చేయలేదని తెలిపారు. అందుకే అందరూ కూడా ఆలోచించి ఓటేయాలి తప్ప ఆగమాగం వేయొద్దని సూచించారు. ముఖ్యంగా యువకులు, విద్యార్థులు, పెద్దింటి అశోక్ వంటి రచయితలు, మేధావులు అందరూ ఆలోచించి ఓటేయాలన్నారు. కాంగ్రెస్ నాయకులు ఏ ఒక్క హామీ అమలు చేయకుండా.. మళ్లీ ఓట్లు అడుగుతున్నారని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు మళ్లీ వాళ్లకే ఓటేస్తే.. ఇష్టమొచ్చిన మాటలు చెప్పి ఏం చేయకున్నా మాకే ఓటేసిండ్రు.. అని మొత్తం బంద్ చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవాళ నరేంద్ర మోదీ వచ్చి గోదావరిని ఎత్తుకుని వెళ్తా అంటున్నాడని కేసీఆర్ తెలిపారు. గోదావరి నుంచి నీళ్లు తెచ్చి మానేరు నదిని సజీవ నదిగా చేసుకున్నామని.. దీంతో మిడ్ మానేరు కళకళలాడుతుండేదని.. కానీ ఇప్పుడు దాన్ని మొత్తం ఎండబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి నది పోతే తెలంగాణకు నీళ్లు ఎలా రావాలి? మనం ఏవిధంగా బతకాలనేది ఆలోచించాలని ప్రజలకు సూచించారు. ఏం చేయకున్నా గాలి గత్తర ఓటేస్తేమంటే.. మన బతుకులు కూడా గావరగావర అవుతాయి తప్ప లాభం జరగదన్నారు. అందుకని వెర్రి ఆవేశం కాదు.. నినాదాలు చెప్పడం కాదు.. మంచిగా ఆలోచించి.. చర్చించి ఓటేయాలని కోరారు.