ఖమ్మం, ఏప్రిల్ 18 : పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సరికొత్త పంథాలో ప్రచారం విస్తృతంగా చేయాలని, రైతుల సమస్యలే అజెండాగా ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గురువారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కీలక సమీక్ష నిర్వహించిన కేసీఆర్.. ఎంపీ అభ్యర్థులతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు, ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారం, అనుసరించాల్సిన వ్యూహంతోపాటు బస్సు యాత్ర రూట్ మ్యాప్ తదితన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఉదయం పొలంబాట పట్టి ఎండిన పొలాలను పరిశీలించిన తర్వాత రోడ్ షోలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారని నామా చెప్పారు. పలుచోట్ల భారీ బహిరంగ సభలకు కూడా ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. కాగా.. ఎన్నికల ఖర్చు కోసం అభ్యర్థులకు నియమావళి ప్రకారం రూ.95 లక్షల చెకులను అందజేశారు. సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఆర్జేసీ కృష్ణ, బొమ్మెర రామ్మూర్తి పాల్గొన్నారు.
ఖమ్మం, ఏప్రిల్ 18: రెండు రోజుల క్రితం మీడియా, సోషల్ మీడియాలో ప్రచురితమైన బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తల నియామక వార్తలో సమాచారలోపం వల్ల కొన్ని పొరపాట్లు జరిగాయని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పార్టీ ముఖ్యులతో చర్చించి త్వరలోనే నియోజకవర్గ సమన్వయ కమిటీని ప్రకటిస్తామని వెల్లడించారు.