లండన్ : లాక్డౌన్ సంబంధిత ఆంక్షలను మరో నాలుగు వారాల పాటు పొడగించినట్లు బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ సోమవారం తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆంక్షలు ఈ నెల 21న ముగియనుండగా మరోసారి పొడగించారు. కరోనా డెల్డా వేరియంట్ సంక్రమణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీఎం పేర్కొన్నారు. ఆంక్షలు జూలై 19వ తేదీ వరకు అమలులో ఉంటాయని, ఆ తర్వాత పొడగించాల్సిన అవసరం ఉండదని ఆశాభావం వ్యక్తం చేశారు. వైరస్ నుంచి రక్షణ పొందేందుకు 40 ఏళ్లు పైబడిన వారికి కొవిడ్ టీకా రెండో మోతాదును వేగవంతం చేస్తామని ప్రధాని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఆదివారం బ్రిటన్లో కొత్తగా 7,490 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. ఎనిమిది మంది మరణించారు. వారం కిందటి కేసులతో పోలిస్తే గతవారం కేసుల్లో 49శాతం పెరుగుదల కనిపించింది.