జైపూర్ : కరోనా రెండో దశలో విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులతో పాటు రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. సామాన్య జనంతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. రాజస్థాన్లో ఇప్పటి వరకు ముగ్గురు ఎమ్మెల్యేలు మృతి చెందగా.. తాజాగా రాజస్థాన్ ప్రతాప్గఢ్ జిల్లాలోని ధారివాడ్ నియోజకవర్గం ఎమ్మెల్యే, బీజేపీ నేత గౌతమ్ లాల్ మీనా (56) కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడి ఆయనను ఉదయ్పూర్లోని ఎంబీ ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు. ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు.
ఈ క్రమంలో పరిస్థితి మరింత విషమించి బుధవారం ఉదయం మృతి చెందారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. ఎమ్మెల్యే మృతికి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పూనియా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, గులాబ్ చంద్ కటారియా సంతాపం ప్రకటించారు. ఇంతకు ముందు రాజస్థాన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కైలాష్ త్రివేది, గజేంద్ర శక్తివత్, బీజేపీ ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి కరోనా సోకి మృతి చెందారు.