కోల్కతా : బీజేపీ నేతలు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ల వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఆందోళన చేపడుతున్న నిరసనకారులు ఢిల్లీ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ధర్నాలకు దిగాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోరారు. కాషాయ నేతల వ్యాఖ్యలకు నిరసనగా రహదారులను ముట్టడిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
బెంగాల్లో ఎలాంటి ఘటనా జరగలేదని, మీరంతా ఢిల్లీ లేదా బీజేపీ పాలిత రాష్ట్రాలకు వెళ్లి నిరసన తెలపాలని సామాన్య ప్రజల తరపున కోరుతున్నానని నిరసనకారులకు దీదీ విజ్ఞప్తి చేశారు. గుజరాత్ లేదా యూపీకి వెళ్లి ఆందోళన చేపట్టాలని కోరారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మ, నవీన్ జిందాల్లపై చర్యలు చేపట్టాలని కోరుతూ హౌరా జిల్లా సహా రాష్ట్ర వ్యాప్తంగా రహదారులను నిరసనకారులు ముట్టడించిన నేపథ్యంలో మమతా బెనర్జీ ఈ ప్రకటన చేశారు.
దేశ ప్రతిష్టను నూపుర్ శర్మ, జిందాల్లు ప్రపంచ దేశాల ఎదుట మంటగలిపారని, వారిని అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. బీజేపీ నేతల విద్వేష వ్యాఖ్యలతో దేశంలో శాంతి సామరస్యాలకు విఘాతం కలిగిందని దీదీ ట్వీట్ చేశారు. విద్వేషం వెదజల్లేలా వీరు చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.