(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల పోలింగ్ సరళి.. దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. మూడు దశల్లో తగ్గిన ఓటింగ్ శాతాన్ని చూస్తే.. అధికార బీజేపీకి ఈసారి భారీగా సీట్లు తగ్గే అవకాశం ఉందన్న వార్తలు బలపడుతున్నాయి. దీంతో కేంద్రంలో విధాన నిర్ణయాలు మారొచ్చన్న అభిప్రాయాలూ పెరుగుతున్నాయి. ఫలితంగా మదుపర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో మార్కెట్లు కుదేలవుతున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మోదీతో పన్నుల మోత తప్పదనే భయాలు ఇందుకు కారణంగా పేర్కొంటున్నారు.
తగ్గిన పోలింగ్.. ఆవిరైన సంపద
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ.. ఈ లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించబోతుందన్న నమ్మకం గతంలో మార్కెట్ వర్గాల్లో ఉండేది. అయితే, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ అంచనాలు క్రమంగా తారుమారవ్వడం ప్రారంభించాయి. ముఖ్యంగా ఏప్రిల్ 19న జరిగిన తొలి దఫా పోలింగ్లో గతంతో పోలిస్తే 4 శాతం ఓటింగ్ తక్కువగా రికార్డయ్యింది. అదే నెల 26న జరిగిన రెండో దశలోనూ గతంతో పోలిస్తే 3 శాతం ఓటింగ్ తక్కువగా నమోదైంది.
దీంతో రెండు దశల పోలింగ్ ముగిసిన తరువాత ఎన్డీఏ విజయం అంత కచ్చితం కాకపోవచ్చన్న అంచనాలు మార్కెట్ వర్గాల్లో, మదుపర్లలో పెరుగసాగాయి. దీనికి తోడు బీజేపీకి కీలకమైన ఉత్తరాదిలో మోదీ గ్రాఫ్ పడిపోయిందన్న అభిప్రాయాలు బలపడ్డాయి. మంగళవారం జరిగిన మూడోదఫాలోనూ పోలింగ్ ఆరు శాతం వరకూ తగ్గింది. దీంతో ఈ ప్రభావం మొత్తంగా మార్కెట్పై పడింది.
దీంతో మంగళవారం ఒక్కరోజే 383.69 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 73,511.85 వద్ద ముగియగా, నిఫ్టీ 140.69 పాయింట్ల నష్టంతో 22,302.5 వద్ద స్థిరపడింది. ఫలితంగా ఒక్కరోజులోనే రూ. 5 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. వెరసి గడిచిన 18 రోజుల్లోనే బీఎస్ఈలో లిైస్టెన కంపెనీలు దాదాపు రూ. 20 లక్షల కోట్ల సంపదను కోల్పోయినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. గత ఐదురోజుల్లోనే సెన్సెక్స్ సుమారు 1500 పాయింట్లు పతనమైనట్టు సమాచారం.
ఆజ్యం పోసిన ఇండియా వీఐఎక్స్ హెచ్చరికలు
భారత స్టాక్ మార్కెట్లలో అస్థిరతను సూచించే ఇండియా వొలటాలిటీ ఇండెక్స్ (వీఐఎక్స్) గడిచిన 9 సెషన్లలో ఏకంగా 72.69 శాతం పెరిగి.. 17.64 శాతానికి చేరుకొన్నది. ఇది 15 నెలల గరిష్ఠం. ఒకవిధంగా చెప్పాలంటే.. మార్కెట్లలో అస్థిరత్వం ఉన్నదని వీఐఎక్స్ డేంజర్ బెల్స్ను మోగించినట్టు భావించవచ్చు. దీంతో అప్రమత్తమైన మదుపర్లు తమ సంపదను వెనక్కి తీసుకోవడం మొదలుపెట్టారు.
కొత్త ప్రభుత్వం వస్తే అది తమ పెట్టుబడులపై ప్రభావం చూపించవచ్చని వాళ్లు భావిస్తున్నట్టు మార్కెట్ పండితులు చెబుతున్నారు. మొత్తంగా.. బీజేపీకి ఈ ఎన్నికల్లో సీట్లు తగ్గుతాయన్న వార్తలు బలపడటమే మార్కెట్లో ప్రకంపనలకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
విజయంపై అనుమానాలు
ముందు భావించినట్టు.. ఎన్డీఏ సునాయాసంగా గెలుస్తుందని ఇప్పుడు ఎవరూ అనుకోవట్లేదు. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. అందుకే, మార్కెట్లలో ఒడిదొడుకులు పెరుగుతున్నాయి.
– వీకే విజయకుమార్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్
పరిస్థితులు మారాయ్
ఎన్డీయేదే మళ్లీ అధికారం అన్న ఊహాగానాలకు.. ప్రస్తుత వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. దీనికితోడు ఇండియా వీఐఎక్స్ ఇండెక్స్లో భారీగా పెరుగుదల నమోదైంది. దీంతో మార్కెట్లో ఒడిదొడుకులు పెరిగాయి.
– ధనంజయ్ సిన్హా, సిస్టమ్యాటిక్స్ గ్రూప్ ఈక్విటీస్ హెడ్